YS Jagan | సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన సీఎం జగన్ బస్సు యాత్ర తొమ్మిదో రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. కావలిలో జన ప్రభంజనం కనిపిస్తోందని చెప్పారు. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా ఈ జిల్లా సిద్ధమంటోందని అన్నారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలు చేధించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలు మోసం చేసే చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధమని జగన్ అన్నారు. ఈ యుద్ధంలో తాను ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. మోసగాళ్లంతా చంద్రబాబు పక్షమేనని పేర్కొన్నారు. సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు అని విమర్శించారు. విశ్వసనీయత, ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పేదలకు చంద్రబాబు చేసిన ఒక్క మంచి పనిచెప్పాలని జగన్ సవాలు విసిరారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని నాలుగు నెలలుగా ప్రశ్నిస్తున్నానని జగన్ తెలిపారు. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని చెప్పారు. చంద్రబాబు మూడుసార్లు రంగు రంగుల మేనిఫెస్టో చూపించారని విమర్శించారు. ఒక్కసారైనా హామీలు అమలు చేశానని చెప్పారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరని విమర్శించారు. మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. మేనిఫెస్టోల కనీసం 10 శాతమైనా అమలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబు ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం చెప్పలేడని విమర్శించారు.
ప్రజలతో చంద్రబాబుది అతకని బంధం అని జగన్ అన్నారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మార్క్ ఏంటి అని ప్రశ్నించారు. మోసాలు, వెన్నుపోట్లతో చంద్రబాబు 14 ఏండ్లు సీఎంగా ఉన్నారని విమర్శించారు. ఇప్పటికీ చేసిన పనులు చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదని అన్నారు. మంచి చేసి ఉంటే 3 పార్టీలతో పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు.