అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ (AEP set ) ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు.
గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించారు. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీ(Primary Key) ని విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్నికల్చరల్ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.
ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని జిష్ణు సాయి మొదటి ర్యాంకు, కర్నూలుకు చెందిన మురసాని సాయి రెండో ర్యాంకును సాధించాడు. ఆదోనికి చెందిన బోగాలపల్లి సందేశ్ మూడో ర్యాంకు , అనంతపురానికి చెందిన పాలగిరి సతీష్రెడ్డి నాలుగో ర్యాంకు , గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్ చౌదరి ఐదోర్యాంకు, తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఇప్ప లక్ష్మీనరసింహారెడ్డి ఆరో ర్యాంకు సాధించాడు. కర్నూలుకు చెందిన గొల్ల లేఖాహర్ష ఏడో ర్యాంకు , అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్కుమార్ ఎనిమిదో ర్యాంకు , హనుమకొండకు చెందిన పరమారాధ్యులు సుశాంత్కు తొమ్మిదో ర్యాంకు, ప్రకాశం జిల్లాకు చెందిన కొమిరిశెట్టి ప్రభాస్కు పదో ర్యాంకు సాధించాడని వివరించారు.