శ్రీబాలాజీ జిల్లా: నటుడు మోహన్బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఉన్నారు. 2019 లో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మోహన్ బాబు ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు మోహాన్ బాబు తిరుపతి కోర్టుకు వచ్చారు. శ్రీవిద్యానికేతన్ నుంచి పాదయాత్రగా ఆయన కోర్టుకు బయల్దేరి వెళ్లారు.
2019 మార్చి 22 న అప్పటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని మోహన్బాబు కుటుంబం తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేసింది. అయితే అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కోడ్ ఉల్లంఘన కింద మోహన్బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్ఓ సతీష్పై కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే వీరు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. ‘న్యాయాధిపతి పిలిచారు.. పేపర్ ఇచ్చారు.. సంతకం పెట్టమన్నారు.. వాయిదా వేశారు.. బయటకు వచ్చేశాను… ఏది మాట్లాడినా తప్పు అవుతుందని, అసలు ఇప్పటి వరకు ఎలాంటి సమన్లు అందలేదని, న్యాయాధిపతి సమక్షంలోనే సమన్లపై సంతకం పెట్టాను’ అని చెప్పారు.