హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలకు చెందిన అధికారుల నివాసాలు, వారి కార్యాలయాలపై గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సూపరింటెండెంట్ వాసా నగేశ్ ఆస్తులపై సోదాలు నిర్వహించారు.
ద్వారకా తిరుమలలోని నగేశ్ అపార్ట్మెంట్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కమ్మురిపాలెంలోని నగేశ్ నివాసంతో పాటు మరో ఆరుచోట్ల సోదాలు జరిపారు. కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాతకు చెందిన ఇండ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావు ఇండ్లపై కూడా దాడులు చేశారు. అతడి భార్య పేరుతో, కొడుకుల పేర్లతో ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు.