ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి అత్యంత అదృష్టవంతుడు మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్. కొత్త మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. నిజానికి చాలా సేపటి వరకూ కేబినెట్ లిస్టులో ఆయన పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయనకు మంత్రి పదవి రాదని అందరూ భావించారు. కానీ ఏపీ సీఎం జగన్ చివరి నిమిషంలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. చివరి నిమిషంలో ఆదిమూలపు పేరు తెరపైకి వచ్చి, అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. నిజానికి ఆదిమూలపు స్థానంలో ఎమ్మెల్యే తిప్పే స్వామి పేరు ఖరారైంది. అయితే… సమీకరణాలు ఎక్కడ మారాయో.. తెలియదు కానీ.. తిప్పేస్వామిని కాదని, ఏపీ సీఎం జగన్ ఆదిమూలపు సురేశ్ పేరును ఖరారు చేశారు. ఇక… ఎమ్మెల్యే తిప్పేస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.
మొదటి మంత్రివర్గంలో ఆది మూలపు సురేశ్ విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో గానీ, పరీక్షల నిర్వహణ సమయంలో గానీ.. ఆయన కచ్చితమైన వాదనతో బలంగా ప్రభుత్వం తరపున నిలబడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే తిప్పేస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో చాలా సేపు సీఎం క్యాంపు ఆఫీసుకి అందుబాటులోనే ఉన్నారు. చివరికి నిరాశతో వెనుదిరిగారు.