తిరుపతి : తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద చెట్టు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గత నాలుగురోజులుగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం కోసం ఆలయం వద్ద షెడ్ను ఏర్పాటు చేశారు.
గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఆలయం ముందు ఉన్న భారీ రాగి చెట్టు భారీ శబ్ధంతో షెడ్పై కూలిపోయింది. దీంతో షెడ్ కింద భక్తులపై పడడంతో షెడ్లో చిక్కుకున్నారు.అక్కడే ఉన్న టీటీడీ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప తీవ్ర గాయాలతో మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెట్టు కూలిన ఘటన దురదృష్టకరమని, భక్తుడు మరణం బాధాకరమని అన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. గాయపడ్డ భక్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.