అమరావతి : దేశంలో సెక్యులరిజం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్(Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం (Sanatana Dharma) పరిరక్షణకు బలమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతిలో గురువారం నిర్వహించిన వారాహి (Varahi) బహిరంగ సభలో కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్(Declaration) ను విడుదల చేశారు.
ఏ మతానికి, ధర్మానికి భంగం కలిగినా ఒకేలాగా స్పందించేలా బలమైన చట్టం తీసుకురావాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం కేంద్రం నిధులు విడుదల చేయాలని సూచించారు. అన్ని ఆలయాల్లో ప్రసాదంలో వినియోగించే నాణ్యమైన వస్తువులు సరఫరా చేసి ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విద్యా, కళా, ఆర్థిక, పర్యావరణ, కేంద్రాలుగా తయారు చేయాలని కోరారు.
సనాతన ధర్మంపై దాడులు జరిగితే స్పందించరెందుకు ?
ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడితే నటులు, చిత్రపరిశ్రమ, వ్యాపారస్తులు అందరూ మాట్లాడుతారని, సనాతన ధర్మంపై దాడులు జరిగితే ఒక్కరూ స్పందించరని ఆరోపించారు. ఈ మధ్య దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దేశానికి వెన్నముక శ్రీరాముడని అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని వెల్లడించారు. ప్రకృతిలోని ప్రతిజీవి సుఖంగా ఉండాలని సనాతన ధర్మం కోరుకుంటుందని, సనాతన ధర్మంపై దాడులు జరిగితే ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ధైర్యంగా గొంతు విప్పాలని కోరారు.
నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. నా ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని మండిపడ్డారు. సనాతన ధర్మం ఎప్పుడూ మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని కోరుకోదని అన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారని, హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని వెల్లడించారు.
హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడమే సనాతన ధర్మంపైనా దాడులకు కారణమని అన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని, మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని అన్నారు. సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.