Srisailam |శిల్పకళా విశేషాలు ఇమిడి ఉన్న శ్రీశైల ప్రాకార కుడ్యంపై ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రీకరణకు చర్యలు చేపట్టినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు చెప్పారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆదేశాలకు అనుగుణంగా శ్రీశైల మహాక్షేత్ర వైభవానికి అద్దం పట్టేలా ప్రతిబింబించే ప్రాకార కుడ్యంపై గల శిల్పకళా విశేషాల చాయాచిత్రాలతో ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన దేవాదాయశాఖ ధర్మప్రచార పరిషత్ సభ్యులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి సమక్షంలో 9 అండ్ 9 డాట్కమ్ ఎండీ వంశీ, శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్కుమార్, పీఆర్వో శ్రీనివాస్రావు, తదితర అధికారులతో కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రధానంగా ఆలయ ప్రాకారంపై ఉన్న శిల్పాల విశేషాలు, ప్రాశత్యాన్ని శీర్షికల రూపంలో చిత్రీకరించి వాటి ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ డాక్యుమెంటరీలను శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడంతోపాటు క్షేత్ర ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ బోర్డులతో భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కళావేదిక, మ్యూజియం, ఆధ్యాత్మిక గ్రంథాలయం, ఆర్ట్ గ్యాలరీ మెదలైన నిర్మాణాలకు స్థల పరిశీలనతోపాటు ఏనుగుల చెరువుకట్ట సుందరీకరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీశైల టీవి ఇంచార్జ్ ఇందుధర్రెడ్డి, ఆలయ స్థపతి జవహర్ తదితరులు పాల్గొన్నారు.