తిరుమల : తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఏఈవో ధర్మారెడ్డి అన్నిశాఖాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన విపత్తుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు, పిడుగులు, అగ్నిప్రమాదాలు, వేసవిలో వడగాలులు లాంటి సవాళ్లు ఎదురవుతాయని, వీటిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని కోరారు. రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో భక్తులను క్రమబద్దీకరించేందుకు మనకు పటిష్టమైన భద్రత వ్యవస్థ టీటీడీకి ఉందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు భారీ నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకోసం ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డీఈ ఎలక్ట్రికల్స్ రవిశంకర్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ మల్లికార్జున, శ్వేత డైరెక్టర్, ఇన్చార్జి డీఎఫ్వో ప్రశాంతి సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తిరుమలలో సంభవించే విపత్తులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)ను సిద్ధం చేసి నాలుగు రోజుల్లో కమిటీకి సమర్పించాలని ఆయన విభాగాధిపతులను ఆదేశించారు.