హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకొన్నది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా అవుతున్నట్టు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందడంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద పోలీసులు మాటువేశారు.
ఎర్రచందనం వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించగా, అతడిని ఢీకొట్టి పరారయ్యారు. గాయపడిన గణేష్ను దవాఖానకు తీసుకెళ్లేలోపు ప్రాణాలు విడిచాడు. 2013 బ్యాచ్ కానిస్టేబుల్ గణేశ్, 14వ బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ఇటీవలే గణేశ్ డిప్యుటేషన్పై యాంటీ స్మగ్లర్ టాస్క్ఫోర్స్కు వచ్చాడు. జిల్లా ఎస్పీ మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.