తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మార్చి 13న 7వ విడత అఖండ బాలకాండ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు . నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమంలో బాలకాండలోని 27 నుంచి 32 సర్గల వరకు గల 155 శ్లోకాలను పారాయణం చేస్తారని వివరించారు.
స్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కాగా నిన్న ఒక్కరోజే 61,620 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారిని జేఈవో వీరబ్రహ్మం, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ ఆహ్వానించారు. మార్చి 29న తిరుమలలో జరుగనున్న వర్ధంతి ఉత్సవాలకు అహోబిలం పీఠాధిపతిని ఆహ్వానించారు.