అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ. 2,470తో నెలకొల్పనున్న గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో రూ. 2,470 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2, 450 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామకవేత్తలు ముందుకు వస్తున్నారని వెల్లడించారు.
తమ పారిశ్రామక విధానం దేశానికి ఆదర్శమని తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పరిశ్రమ ఏర్పాటుకు సమస్యలు పరిష్కరించకుండా సంతకాలు చేసిందని తెలిపారు. వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత పరిశ్రమల స్థాపనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుని అనుమతులు ఇస్తుందని వివరించారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీ నెలకొల్పితే స్థానికులకు ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టాలు వస్తాయన్న బాధతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల వల్ల పోలీసులు 131 మందిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం జీవో నంబర్ 321ను ఇవాళే విడుదల చేశామని జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమర్నాథ్తో పాటు ఇండస్ట్రీకి చెందిన యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.