కడప : చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఐదు నెలల చిన్నారిని చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున చైన్ స్నాచర్ను పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళ చేతిలో ఉన్న చిన్నారి భవనం పైనుంచి కిందపడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున కడప జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
కడప జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం ఫాతిమా కాలేజీ సమీపంలో నివసిస్తున్న గృహిణి భారతి.. వేసవికాలం కారణంగా ఇంటి డాబాపై పడుకున్నది. ఉదయం నిద్రలేచిన ఆమె.. బిడ్డను ఎత్తుకుని కిందికి దిగుతున్నది. అక్కడే మాటు వేసిన ఓ దొంగ భారతి ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ మహిళ తన చేతిలో ఉన్న 5 నెలల పసికందును వదిలేసింది. దాంతో చిన్నారి ఇంటి మీద నుంచి కిందపడి మృతి చెందింది.
ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకున్నది. 5 నెలల పసిబిడ్డ మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.