తిరుపతి: అవినీతికి పాల్పడిన కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్సన్ వేటు పడింది. అవినీతికి పాల్పడటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈ నలుగురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అంతర్గత విచారణ జరిపించిన జిల్లా ఎస్పీ.. వారిపై చర్యలు తీసుకున్నారు. ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు పోలీసు అధికారులు సస్పెన్షన్కు గురికావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తిరుచానూరు పోలీస్ స్టేషన్లోని సీఐతోపాటు ముగ్గురు ఎస్ఐలను జిల్లా ఎస్పీ పీ పరమేశ్వర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో హైదరాబాద్కు చెందిన నితీశ్ తనకు చెందిన రెండంతస్తుల భవనాన్ని చెన్నైకి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. ముత్తు కుమార్ దాన్ని ఐటీసీ కంపెనీకి గోదాముగా సబ్లీజ్కు ఇచ్చాడు. తన ఆస్తిని విక్రయించాలని నిర్ణయించుకున్న నితీశ్.. తన భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తు కుమార్ను కోరాడు. అయితే అందుకు ముత్తు కుమార్ నిరాకరించకపోవడంతో మణికంట అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ను సంప్రదించాడు. భారీ మొత్తంలో కమీషన్ ముట్టజెప్పడంతో.. మణికంఠ ఆ భవంతిని ఒక వైద్యుడికి విక్రయించాడు. భవనం అప్పగింతకు వైద్యుడి నుంచి ఒత్తిడి రావడంతో మణికంఠ.. తన స్నేహితులు ఇర్ఫాన్, శ్రీనివాస్, మరికొందరు గూండాలతో గోదాంలోకి ప్రవేశించాడు. ఐటీసీ కంపెనీకి చెందిన భవనంలో భద్రపరిచిన రూ.20 లక్షల విలువైన బిస్కెట్లు, చాక్లెట్లు, సిగరెట్ ప్యాకెట్లను వారు బయటకు విసిరేశారు.
తిరుచానూరు ఎస్ఐ వీరేష్ సహకారంతో మణికంఠ తదితరులు సిగరెట్ ప్యాకెట్లను తమకు తెలిసిన దుకాణాల్లో తక్కువ ధరకు విక్రయించారు. ఐటీసీ అధికారుల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి.. పుత్తూరు డీఎస్పీ టీడీ యశ్వంత్కు విచారణకు ఆదేశించారు. సరుకులు అమ్మగా వచ్చిన మొత్తాన్ని సీఐ ఎం సుబ్రహ్మణ్యం, ఎస్ఐలు వీరేశ్, బీ రామకృష్ణారెడ్డి, ఎం రామకృష్ణ పంచుకోవడం వంటి అంశాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. విచారణ నివేదిక ఆధారంగా అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఆమోదంతో నలుగురు పోలీసు అధికారులను ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.