అమరావతి : ఇంటికి కాబోయే అల్లుడికి ఓ కుటుంబం పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 365 రకాల వంటకాలతో ఆథిత్యం ఇచ్చింది. సంవత్సరంలో 365 రోజుల చొప్పున రోజుకొక వెరైటీ చొప్పున పిండివంటలతో మనువరాలిని మనువాడబోయే యువకుడికి ఆతిథ్యం ఇవ్వగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటన గోదావరిలో జరగ్గా.. ‘గోదారోళ్లు ఆతిథ్యం అలా ఆషామాషీగా ఉండదుగా. అసలే సంక్రాంతి.. కాబోయే అల్లుడు ఇంటికొచ్చె.. ఇక ఆ వంటకాలు మామూలుగా ఉంటాయా’.. ‘గోదారోళ్లంటే మజాకా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయలక్ష్మి జ్యూయలర్స్ అధినేత అత్యం వెంకటేశ్వరావు మాధవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందే సంక్రాంతి పండుగ రావడంతో పెళ్లి కుమార్తె తాత ఆచంట గోవింద్ – నాగమణి దంపతులు కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో ఆతిథ్యం సంక్రాంతి పండుగ రోజున ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కాబోయే మనవడికి 365 రకాల వంటలను రుచి చూపించారు. ఇందులో వంద రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలతో ఘనమైన ఆథిత్యం ఇచ్చారు.