అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ఘర్షణలకు కేంద్రమైన అమలాపురంని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా భారీగా బలగాలను మోహరించారు. పట్టణంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఐపీఎస్లకు బాధ్యతలు అప్పగించారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి అభ్యతంరాలను స్వీకరించేందుకు నెల రోజుల సమయం కేటాయించింది. అయితే పేరును మారమార్చొద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో మంగళవారం భారీఎత్తున ఆందోళన నిర్వహించింది. అదికాస్తా అదుపుతప్పి హింసాత్మకంగా మారింది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇండ్లకు, బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అన్ని నెట్వర్క్లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడేవరకు ఇది అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు.