శ్రీశైలం : దైవ దర్శనానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. ఈ విషాద ఘటన శ్రీశైలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం నరసరావుపేట డిపో నుంచి శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సును దోర్నాల వైపునకు వెళ్తున్న దూసుకువచ్చింది. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మహేశ్వరి అనే యువతి (20) అద్దాల్లోంచి తల బయటకు పెట్టింది. వేగంగా దూసుకువచ్చిన లారీ ఆమె తలకు తాకడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలు నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్నది. కార్తీకమాసం కావడంతో శ్రీశైలంలో ఉండే తన స్నేహితురాలితో కలిసి దీపాలు వెలిగించేందుకు వస్తుందని మృతురాలి కుటుంబీకులు తెలిపారు. కార్తీకమాసం వేడుకల్లో పాల్గొనేందుకు వస్తూ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం అలుముకున్నది. శ్రీశైల క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయ రోడ్డు దాటిన అనంతరం ప్రమాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.