తిరుమల : త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గోవు సంబంధిత ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు ఈఓ జవహర్రెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా పలువురు భక్తుల నుంచి వచ్చిన సలహాలు సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గోవు మాట్లాడుతూ ఉత్పత్తుల తయారీ కోసం టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని గో సంరక్షణ కేంద్రానికే వెచ్చించనున్నట్లు చెప్పారు. త్వరలోనే శ్రీవారి ఆర్జిత సేవలు ప్రారంభిస్తామని, ఏప్రిల్ 14 నుంచి సేవల్లో పాల్గొనే భక్తులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. కొవిడ్ పరీక్ష చేయించుకోకుంటే ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అలిపిరి, తిరుమలలో మల్టీలెవల్ పార్కింగ్కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆలయాలను ఇక టీటీడీ పరిధిలోకి తీసుకోమని, ప్రముఖ ఆలయాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కల్యాణ మండపాల లీజును మూడు నుంచి ఐదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. తిరుమలలో 150 విద్యుత్ బస్సులు నడిపేందుకు యత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. టీటీడీ ఆవు ఆధారిత సహజ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఇందులో సబ్బులు, ధూప్స్టిక్స్, ఫేషియల్స్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోసంరక్షణశాల నుంచి శ్రీవారి సేవకు పాలను వినియోగిస్తోంది. అలాగే పూల తోటలకు అవసరమైన ఎరువులను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం వినూత్న ఉత్పత్తులు తయారు చేసి, మార్కెటింగ్ చేయాలని భావిస్తోంది. పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రం విక్రయాలకు ఉపక్రమిస్తోంది. ఇందు కోసం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇటీవల ఆలయ ఈఓ ఆదేశాలు జారీ చేశారు. నాగ్పూర్కు చెందిన ‘గోవిజ్ఞాన్ అనుసంధన్ కేంద్రా’తో టీటీడీ సంప్రదింపులు జరుపుతోంది.