కాకినాడ జిల్లా: వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో ఊపిరాడక చిన్నారులు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అస్వస్థతకు గల కారణాలను ఉపాధ్యాయలు, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. చిన్నారులకు తగిన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. స్కూల్కు వచ్చి ప్రార్థన తర్వాత తరగతి గదిలోకి వెళ్లగానే ఊపిరాడక కళ్లు తిరిగి కిందపడిపోయారు. విషయం తెల్సుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వారిని వలసపాకలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. క్లాసులోకి వెళ్లగానే కళ్లు మంటలు లేచినట్లు అనిపించిందని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి పడిపోయినట్లు పిల్లలు చెప్తున్నారు. నిన్న రాత్రి కేకు తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కారణాలు మాత్రం తెలియరాలేదు. ఉపాధ్యాయులు దగ్గరుండి మరీ విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నారు. తల్లిదండ్రులు వలసపాకలకు వచ్చి తమ చిన్నారుల కోసం ఆరా తీసి వారు క్షేమంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు అందరూ 6 వ తరగతికి చెందిన వారే కావడం విశేషం.
అస్వస్థతకు గురైన చిన్నారులు అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని విద్యాశాఖ అధికారులను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. దాంతో అధికారులు వలసపాకలోని దవాఖానకు వచ్చి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించేలా చేశారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, సాయంత్రానికల్లా వారిని ఇళ్లకు పంపించివేస్తామని అధికారులు చెప్తున్నారు.