Banana cultivation | అరటి ఊష్ణ మండల పంట. దాదాపు 25-30 డిగ్రీల సెల్సియస్ అనుకూలం. శీతాకాలంలో 15 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ కాకూడదు. మంచి నాణ్యమైన అరటి పండ్లను పొందటానికి పంట నిర్వహణ చాలా ముఖ్యమైనది. వేసవిలో నీటిని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్వహణ పద్ధతులు చేపట్టడం చాలా అవసరం. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు తగినంత నీరు అందుతుంది. గెల వేసే సమయంలో నెలకు ఒక మొక్కకు 25 కిలోల ఆవు పేడ, 100 గ్రాముల పొటాష్, 200 గ్రాముల యూరియా వంటి ఎరువులను ఇవ్వాలి.
కర్పూర చక్కెర కేలి
దేశంలో 70 శాతం అరటి ఉత్పత్తి ఈ రకానికి చెందినదే. వీటి గెలలు పెద్దవిగా 10-15 కేజీల వరకు బరువుంటాయి. గెలకు దాదాపు 135-170 కాయలుంటాయి. 12 నేలల్లోనే పంట అందివస్తుంది. ఈ రకం నిల్వ ఉంచడానికి తగినవే కాకుండా రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. పనామా తెగుళ్ళను, ఆకు మచ్చ తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది.
తెల్ల చెక్కెర కేళి
ఆకులో అంచుపైకి తిరిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత. గెల చిన్నదిగా ఉండి 6-8 కేజీల బరువు ఉంటుంది. ఒక గెలలో 60-80 కాయలు కలిగి ఉంటుంది. 12 నేలల్లో పంట కోతకు వస్తుంది. పనామా తెగులును తట్టుకుంటుంది. అధిక ఉష్ణోగ్రత సారవంతం కలిగిన నెలలకు అనుకూలం కాదు.
అమృత పాణి
ఇది పొడవు రకం 13-14 నెలల్లో పంట అంది వస్తుంది. గెల 15-20 కేజీల బరువు ఉండి 80-100 కాయలను కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ చేయడానికి పనికి రాదు. పండిన వెంటనే గెలల నుంచి పండ్లు రాలిపోవడం మొదలవుతుంది. పనామా తెగులు ఈ రకంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆకు మచ్చ తెగులును తట్టుకోగలదు.
వామన కేళి
ఈ రకం కాయలు గట్టిగ ఉన్నందున తుఫాను గాలి తాకిడికి కూడా తట్టుకుంటాయి. వీటి గెల 12-15 కేజీల బరువుతో దాదాపు 120 కాయలు కలిగి ఉంటుంది. 11 నెలల కాలంలో పంట అందివస్తుంది. ఇది చాలా తీపి రకం. పండు పండిన తర్వాత తోలుపైన చుక్కలు వస్తాయి. ఎక్కువ కాలం నిల్వకు పనికి రావు. పనామా తెగులును తట్టుకుంటుంది.
పనామా తెగులు
అరటిని నిరంతరాయంగా పండించడం, అధిక ఉష్ణోగ్రత, నీటి పారుదల లేని, తేలికపాటి నేలలు, అధిక తేమ శాతం పనామా వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తాయి. మట్టి ద్వారా సంక్రమించే ఈ వ్యాధి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. నీటి పారుదల సక్రమంగా లేని నేలల్లో ఎక్కువగా సంభవిస్తుంది. ఇది సోకిన తొలి దశలో ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి. వ్యాధి సోకిన మొక్క కాండం ఎర్రటి చారలు కలిగి ఉంటుంది.
నియంత్రణ చర్యలు
ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను వేరుచేసి కాల్చేయాలి. ఒకవేళ ఈ వ్యాధి తాకిడి తీవ్రంగా ఉంటే కనీసం 3-4 ఏండ్ల పాటు అరటిని సాగు చేయకుండా చూసుకోవాలి. పనామా తెగులుని తట్టుకొనే రకాలను ఎంచుకోవడం ఉత్తమం. అరటి మొక్క పునాది దగ్గర సున్నం నీటిని చల్లడం ద్వారా వ్యాధి సోకకుండా నివారించవచ్చు. అరటి సాగు తర్వాత అదే పొలంలో పొద్దుతిరుగుడు లేదా చెరకును సాగు చేయకుండా చూడాలి.
ఈ వ్యాధి నివారణకు 10 లీటర్ల నీటికి 10గ్రాముల కార్బెండజిమ్ కలిపి అరటి పిలకలకు పిచికారీ చేయాలి. మట్టిలో ట్రైకోడెర్మా వైరైడ్ లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వంటి బయోఏజెంట్లను ఉపయోగించడం ద్వారా ఈ పనామా తెగులును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.