Chamanti cultivation | అన్ని పూలతోటల్లో చక్కగా అమరే పూల మొక్క చామంతి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే చలికాలం నాటికి అందివస్తాయి. పసుపు, నారింజ, ఎరుపు, ఊదా, గులాబీ, తెలుపు.. ఇలా ఎన్నో రంగుల్లో కనువిందు చేస్తున్నాయి. ఎక్కువ కాలం పూసే గుణం ఉండటం వల్ల వీటిని అలంకరణలో ఎక్కువగా వాడుతున్నారు. పైరిల్రిన్ అనే రసాయనం ఈ పూలల్లో ఉండటం వల్ల చామంతి ఉండే ఇళ్లల్లో కీటకాలు దరిచేరవని చెప్తుంటారు నిపుణులు. చామంతి పూలకు పండగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో అలంకరణకు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో వీటిని ఇంటి పెరట్లో గానీ, పొలంలో గానీ సాగు చేపట్టి మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణం, నాటే సమయం..
పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చేమంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్, జూలై మాసాలలో మొక్కలను నాటినట్టయితే నవంబరు, డిసెంబరు మాసాలలో పూస్తాయి. సమూహాలుగా, చిన్న గుంపులుగా ఎలా నాటుకున్నా అన్ని ప్రదేశాల్లో చక్కగా పెరుగుతాయి. తేలికపాటి నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉండాలి. మురుగునీటి పారుదల సరిగా లేకపోతే మొక్కలు చనిపోతాయి.
తల తుంచడం..
నాటిన మొదటి నెలలో వారానికి రెండు, మూడు సార్లు, అటుతర్వాత వారానికి ఒక తడి ఇవ్వాలి. నారు నాటిన తర్వాత సుమారు నెలరోజులకు చేమంతి మొక్కల తలలు త్రుంచివేయడం వల్ల పక్క కొమ్మలు ఏర్పడి అధిక పూల దిగుబడి పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుండి 75 నుండి 120 పూలను పొందవచ్చు.
ఎరువులు
మొక్కలను 20-30 సెం.మీ ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 55 వేల నుండి 60 వేల మొక్కలు అవసరమవుతాయి. నాటడానికి ముందు ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, 60 నుండి 80 కిలోల పొటాష్ వేసుకోవాలి.
పూలకోత
జూన్, జూలైలో నాటిన మొక్కలు డిసెంబరు, జనవరి వరకు పూతపూసి కోతకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10 నుండి 15 సార్లు పూలు కోయవచ్చు. ఎకరాకు 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది.
సస్యరక్షణ
చేమంతి పంటకు ముఖ్యంగా పచ్చపురుగు, ముడత, ఆకు తొలుచు పురుగు ఎక్కువగా నష్టం కలగచేస్తాయి.
పచ్చపురుగు: ఈ పురుగులు ఆకులను తినేస్తూ పువ్వును పాడుచేస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలను గాని లేక క్వినాల్ఫాస్ పొడి 8 కిలోలు ఎకరం విస్తీర్ణంలో చల్లుకోవాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకుని నివారించవచ్చు.
త్రిప్పు: ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుతలు పడిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. నివారణకు డైమిధోయేట్ 1.5 మి.లీ. లేక కార్బరిల్ 50 శాతం పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు: నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడటం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణకు మంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.