కూరగాయల సాగు.. రైతులకు ప్రతిరోజూ ఆదాయం తెచ్చిపెడుతున్నది. వ్యాపారులు,ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటలలో.. ‘బీరకాయ’ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తున్నది. అంతేకాకుండా, ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి, పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. భారీ లాభాలు అందుకొనే అవకాశం ఉన్నది.
బీరకాయల్లో జగిత్యాల లాంగ్, పూసా నస్దర్, జైపూర్ లాంగ్, నేతిబీర ముఖ్యమైన రకాలు.
జగిత్యాల లాంగ్ : ఇది కరీంనగర్ జిల్లాకు చెందిన రకం. ఈ రకానికి చెందిన కాయలు 50 నుంచి 60 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా ఉంటాయి. ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అయితే అధిక ఉష్ణోగ్రతను ఈ రకం తట్టుకోలేదు. కాబట్టి, వేసవిలో సాగు చేయకపోవడమే మంచిది.
పూసా నస్దర్ : ఈ రకం మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది. 60 నుంచి 65 రోజుల్లో చేతికి వస్తుంది. ఒక్కో తీగకు 15 నుంచి 20 కాయలు కాస్తాయి. వీటి కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోపలి గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం వేసవితోపాటు వానకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడిని అందిస్తుంది.
జైపూర్లాంగ్ : ఈ రకం కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో, 25 నుంచి 30 సెం.మీ పొడవు ఉంటాయి. వీటిని పందిరి పద్ధతిలోనే సాగు చేయాల్సి ఉంటుంది. అందుకే, దీనిని ‘పందిరి బీర’ అని కూడా అంటారు. ఇవి వేసవి, వానకాలంలో సాగుచేయడానికి అనుకూలంగా ఉంటాయి. వానకాలంలో సాగు చేసేటప్పుడు రెండు వరుసల మధ్య 2.5 మీటర్ల దూరం ఉండాలి. రెండు పాదుల మధ్య 0.9 మీటర్లు ఉండాలి. వేసవిలో సాగు చేసేటప్పుడు 1.5 మీటర్ల మధ్య దూరం ఉండాలి. రెండు పాదుల మధ్య 0.6 మీటర్ల దూరం ఉండాలి. ఇందులోనే ‘పొట్టిబీర’ కూడా ఉంటుంది. అది 12 నుంచి 20 సెం.మీ. వరకూ పెరుగుతాయి. ఈ రకం కాయలు చూడటానికి లావుగా ఉంటాయి.
నేతిబీర : బీరకాయ జాతులలో ప్రత్యేకమైనది. సామాన్య బీరకాయ కంటే మోటుగా పెరుగుతుంది. వీటి ఆకులు గుండ్రంగా, పువ్వులు పెద్దగా ఉంటాయి. ఈ రకం బీరకాయలు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు మందం (లావు)గా ఉంటాయి. కాయలు నునుపుగా ఉంటాయి. అయితే, ఇవి అంత రుచిగా ఉండవు. విదేశాల్లో ఎండిన నేతిబీర పీచుతో స్క్రబ్స్ తయారు చేస్తుంటారు.
అనుకూల వాతావరణం : బీరకాయ సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం. 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలో మంచి దిగుబడులు వస్తాయి. అయితే, మొక్కలు పెరిగే సమయంలో వేడి ఎక్కువగా ఉంటే.. మగ పూలు ఎక్కువగా పూస్తాయి. అందుకోసమే వానకాలంలో సాగు చేయాలనుకుంటే.. జూన్ నుంచి జూలై వరకు, వేసవి కోసం డిసెంబర్ నుంచి జనవరి వరకు సాగు చేసుకోవాలి.
అనువైన నేలలు : నీటిని నిలుపుకొనే నేలలు బీరసాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి ఎర్రగరప నేలలు, బంకమట్టి నేలలతోపాటు మురుగు నీరు పోయే ఒండ్రు నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.0 వరకు ఉండేలా చూసుకోవాలి.
సాగునీటి యాజమాన్యం : నేల, వాతావరణం ఆధారంగా నీటి తడులు ఇవ్వాలి. పాదు చుట్టూ 3 నుంచి 5 సెం.మీ. మందం మట్టి ఎండి ఉన్నప్పుడు నీటిని అందించాలి. వారానికి ఒకసారి నీటి తడులు అందించాలి. ముఖ్యంగా నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
సస్యరక్షణ : ఎండకాలంలో లోతుగా దుక్కి దున్నాలి. ముఖ్యంగా పంట మార్పిడి చేయాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. బీరకాయ సాగులో ప్రధానంగా గుమ్మడి పెంకు పురుగు, పాము పొడ తెగులు, ఫ్రూట్ఫ్లై, బూజు తెగులు, ఆకుపచ్చ తెగులు, బూడిద తెగులు, వైరస్ తెగులు వంటివి సోకుతాయి.
గుమ్మడి పెంకు తెగులు : గుమ్మడి పెంకు పురుగుల్లో ఎక్కువగా తల్లి పురుగులు లేత ఆకులపై వ్యాపిస్తాయి. దీనివల్ల పంట మొత్తానికీ నష్టం కలుగుతుంది. వీటిని నివారించడానికి వేప కషాయం లేదా నీమాస్త్రం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పాము పొడ తెగులు : ఈ తెగులు గొంగళి పురుగుల మాదిరిగా చాలా సన్నగా ఉంటుంది. ఆకుల పొరల్లో చొచ్చుకొనిపోయి ఆకు మొత్తాన్నీ తిని నష్టపరుస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై తెల్లని గీతలు ఏర్పడతాయి. వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటే పంటను తీవ్రంగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ పురుగును నివారించడానికి పంట పెరుగుతున్న దశలోనే.. 5 శాతం వేపగింజల కషాయం లేదా రెండు శాతం వేపనూనెను పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పురుగు వ్యాపించిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించి నాశనం చేయాలి.
ఫ్రూట్ఫ్లై : ఈ రకానికి చెందిన పురుగులు లేత పిందెలపై వ్యాపించి గుడ్లు పెడతాయి. వీటినుంచి వచ్చిన సన్నని పురుగులు కాయలో గుజ్జును తింటాయి. దీనివల్ల కాయ మొత్తం కుళ్లిపోతుంది. వీటిని నివారించడానికి మొగ్గ పెరుగుదల సమయంలోనే వేప కషాయం లేదా నీమాస్త్రం పది రోజుల వ్యధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. 5 కిలోల వేపపిండిని మొక్క మొదళ్లలో పాదుకు అందించాలి.
బూజు తెగులు : బూజు తెగులు ఎక్కువగా ఆకు అడుగు భాగంలో బూజులా కనిపిస్తుంది. ఇది వ్యాపించినప్పుడు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు బాగా పండి ఎండిపోతాయి. దీనిని నివారించడానికి బాగా పులిసిన మజ్జిగ, ఇంగువ ద్రావణంలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు : ఆకుమచ్చ తెగులు వ్యాపించినప్పుడు ఆకులపై గుండ్రని చిన్నచిన్న మచ్చలు ఏర్పడతాయి. వీటి ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలు కూడా పెద్దవిగా మారి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఈ మచ్చలు కాయలను కూడా ఆశిస్తాయి. వీటివల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
బూడిద తెగులు : దీనిని ‘మొజాయిక్ తెగులు’ అని కూడా అంటారు. బూడిద తెగులు వ్యాపించినప్పుడు ఈనెల వద్ద పసుపు రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. దీనిని నివారించడానికి పచ్చి ఆవుపాలతో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఒక లీటర్ ఆవుపాలలో 250 గ్రాముల విత్తనాలను వేసి, 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. పంటలో రసం పీల్చే పురుగులు కనిపిస్తే.. 5 శాతం వేప కషాయం లేదా 5 శాతం వావిలాకు కషాయం, నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఐదు లీటర్ల పచ్చి ఆవుపాలను 100 లీటర్ల నీటిలో కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేసినా ఈ తెగులును నివారించవచ్చు. ముఖ్యంగా వైరస్ తెగులు వ్యాపించిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, వెంటనే నాశనం చేయాలి. తెగులు వ్యాపించని మొక్కల నుంచే విత్తనాలను సేకరించుకోవాలి.
ముందుగా నేలను 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసి, కలియ దున్నాలి. 60 నుంచి 80 సెంటీమీటర్ల దూరంతో కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 2.0 మీటర్లు ఉండేలా చూసుకోవాలి.
బీరసాగులో విత్తనశుద్ధి అవసరం. కిలో విత్తనాలకు 3 గ్రా. థైరం, 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్లను కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న నేలలో గుంతలను తవ్వుకోవాలి. ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల సహజ ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ చొప్పున గుంతల్లో నింపాలి. 40 కిలోల నత్రజనిని రెండు సమభాగాలుగా చేసి.. విత్తిన 25 రోజులకు ఒకసారి, పూత, పిందె దశలో మరోసారి వేయాలి. మొక్కకు ఎరువులను దగ్గరగా వేసినప్పుడు నీటి తడులను అందించాలి. విత్తనాలు వేసేముందు మురుగునీరు పోయేలా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గుంతలోనూ 1.2 సెం.మీ. లోతులో మూడు విత్తనాలను వేసుకోవాలి.