తక్కువ నీటితో.. తక్కువ పెట్టుబడితో.. తక్కువ సమయంలో.. ఎక్కువ లాభాన్ని అందించే పంటగా థాయ్ జామ ఆదరణ పొందుతున్నది. అయిదారేండ్ల కిందట మొదలైన ఈ పండ్ల తోటల సాగు రాష్ట్రమంతటా క్రమంగా విస్తరిస్తున్నది. ఏటా రెండుసార్లు.. ఎకరానికి 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తున్నది. దీంతోపాటు.. అనేక ఆరోగ్య అంశాలు ఇమిడి ఉన్న పండు కావడంతో మార్కెట్లోనూ మంచి డిమాండు పలకుతున్నది. దీంతో రైతాంగం ఈ పంట సాగు దిశగా మొగ్గు చూపుతున్నది. ఇప్పటికే సాగు చేస్తున్న వారికి వస్తున్న లాభాలను చూసి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. అయితే నిత్యం స్వయం పర్యవేక్షణ, సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపడితేనే లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏడాదికే పంట..
థాయ్ జామ సాగుకు తక్కువ నీరే సరిపోతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీటినీ పొదుపుగా వాడుతూ.. తోట సాగు చేపట్టాలి. తొలి ఏడాదే కొంత దిగుబడి వచ్చినా, రెండో ఏడాది పంటను మాత్రమే దిగుబడిగా తీయవచ్చు. క్రమం తప్పకుండా నిత్య పర్యవేక్షణతో వీలైనంత వరకు సేంద్రియ పద్ధతుల్లోనే సస్యరక్షణ చేపట్టడం వల్ల మంచి దిగుబడి పొందవచ్చు. మచ్చ సోకి కాయలు కుళ్లిపోకుండా పాలిథిన్ కవర్, న్యూస్ పేపర్లతో బ్యాగింగ్ చేయాలి. నవంబర్-డిసెంబర్ మధ్య ఒకసారి.. ఏప్రిల్-మే నెలల్లో మరోసారి పంట దిగుబడి లభిస్తుంది. ఒక్కో చెట్టుకు 100 వరకు కాయలు కాస్తున్నాయి. ఒక్కో సీజన్లో ఎకరాకు కనిష్ఠంగా 6 టన్నుల నుంచి గరిష్ఠంగా 10 టన్నుల వరకు దిగుబడి లభిస్తుండగా.. మార్కెట్లో కేజీ ధర రూ. 50 నుంచి రూ. 80 వరకు ఆయా సందర్భాలను బట్టి రైతుకు గిట్టుబాటు అవుతున్నది.
సమగ్ర సస్యరక్షణతోనే అధిక దిగుబడి
జామ కాయ ఎదుగుతున్న క్రమంలో మచ్చ సోకే అవకాశం ఉండగా.. అది క్రమంగా పెద్దదై.. కాయను మొత్తం తొలిచే ప్రమాదమూ ఉన్నది. కొంత ఖర్చయినా.. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ.. ఒక్కో మొక్క పైన పెంచడానికి ఎంపిక చేసిన కాయలకు బ్యాగింగ్ చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నిలువరించవచ్చు. 150 నుంచి 200 గ్రాములు ఉన్న కాయలను ఎంపిక చేసి.. ముందుగా వాటిని పాలిథిన్ కవర్తో చుట్టి.. సూర్యరశ్మి సోకకుండా పాలిథిన్ కవర్ పైన న్యూస్ పేపర్ ఉంచి పిన్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బరువు పెరిగే కాయకు.. మచ్చతోపాటు ఇతర తెగుళ్లను సైతం నివారించడం సాధ్యమవుతున్నది. ఒక్కో కాయ బరువు 500 గ్రాముల నుంచి గరిష్ఠంగా 750 గ్రాముల వరకు ఉంటున్నది.
సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి
థాయ్ జామ సాగు ఇటీవల పెరుగుతున్నది. ఒక్క నల్లగొండ డివిజన్లోనే 200 ఎకరాలకు పైగా ఈ తోటలు వేశారు. వీఎన్ఆర్ బీహి అనే వంగడంలో తెలు పు, పింక్ రకాల మొక్కలు లభిస్తున్నా యి. ఈ తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ పై సబ్సిడీ అందిస్తున్నది. ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా కలిగిన ఈ ఫలం మధుమేహం రోగులు సైతం తీసుకోవచ్చు. కాయలను సంరక్షించుకోవడానికి బ్యాగింగ్ చేసుకోవడంతోపాటు.. ప్రూట్ ఫ్లై (పండు ఈగ), మచ్చ తెగులు (ఆంత్రక్నోస్) సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ఏటా రెండుసార్లు ప్రూనింగ్ (కొమ్మల కత్తిరింపు) చేయాలి. ప్రారంభంలోనే నిమటోడ్ లేని మొక్కలు ఎంచుకోవాలి. ఒకవేళ నిమటోడ్ సోకితే ఒక మిల్లీలీటర్ వేలమ్ ప్రైడ్ను లీటర్ నీటిలో.. 3 గ్రాముల నిమిడ్జ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేప పిట్టు మొక్కలకు ఎరువుగా వేసుకుంటే మంచిది. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితేనే దిగుబడి పెరిగి, రైతుకు అధిక లాభం చేకూరుతుంది.
కొత్తగా సాగు చేయాలనుకునే వారు
– తోటల సాగుకు అనుకూలమైన నేలను గుర్తించాలి.
– నిమటోడ్ సోకని మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
– మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం పాటించాలి.
– సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి.
– ఏటా రెండుసార్లు ప్రూనింగ్ (కత్తిరింపు) చేపట్టాలి.
– బ్యాగింగ్ చేసి కాయలను సంరక్షించుకోవాలి.
– నిపుణుల సూచనలతో సస్యరక్షణ చేయాలి.
– డిమాండు ఉన్న చోట మార్కెట్ చేసి లాభాలు ఆర్జించాలి.