Micronutrients deficiency | పంటలు ఏపులా పెరిగి మంచి దిగుబడి రావాలంటే ఆ నేలలో పోషకాల లోపాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఏ పంటకైనా గాలి, నీరు, సూర్యరశ్మితోపాటు సూక్ష్మపోషకాలు అందాలి. పోషకాలు సమపాళ్లలో అందనిపక్షంలో పంటల్లో దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. అందుకని పంటల సాగులో సూక్ష్మపోషకాల లోపం రాకుండా చూసుకోవడం చాలా అవసరం. భూమిలో పోషకాల పరిణామాన్ని బట్టి మొక్కల పెరుగుదల, దిగుబడి ఆధారపడి ఉంటుంది. అన్ని మొక్కలకు ఒకే రకమైన పోషకాల లోపం ఉండదు. అందుకని వాటిని గుర్తించి తగిన రీతిలో పోషకాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
మెగ్నీషియం లోపం
ఈ ఖనిజం లోపం ఉన్న సందర్భాల్లో మొక్కల ముదురు ఆకుల్లో లోపం కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారుతుంది. లోపం మరీ ఎక్కువగా ఉంటే ఊదారంగులోకి మారి ఆకుల చివరి భాగాల్లో మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతుంటాయి. దీని నివారణ కోసం మెగ్నిసైట్ అనే మందును దుక్కిలో వేయాలి. పంటలో లోపం కనిపించిన వెంటనే మెగ్నిషియం 1% లీటర్ నీటికి 10 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి. మెగ్నీషియం అందివ్వడం వలన భూమిలో ఉన్న ప్రోటీన్లు మొక్కకు అందుతాయి. భాస్వరం ఎరువులను మొక్కలకు సమపాళ్లలో అందిస్తుంది.
గంధకం లోపం
గంధకం లోపం మొక్కల్లోని చిగురుటాకుల్లో కనిపిస్తుంది. ఆకుటు పచ్చటి పత్రహరితాన్ని కోల్పోయి పాలిపోయి కనిపిస్తాయి. మొక్కల్లో పూతలు కనిపించడం తగ్గిపోతుంది. నూనె గింజల పంటల్లో గంధకం లోపం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్, గంధకం పోషకాలు కలిగిన ఎరువులు దుక్కిలో వేసుకోవాలి. పోషక నివారణ మందులు పిచికారి చేయాలి. గంధకం నత్రజని మాదిరిగా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిగేందుకు దోహదపడుతుంది. నూనెగింజల పంట్లో నూనె శాతం పెరిగేందుకు గంధకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మాంగనీసు లోపం
మాంగానీసు లోపం ఉన్న మొక్కల్లో ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి. మాంగానీసు లోపాన్ని నివారించడానికి ఎకరానికి 30 నుంచి 50 కిలోల మాంగానీసు సల్పేట్ దుక్కిలో వేసుకోవాలి. పంటలో కనిపించినప్పుడు మాంగనీసు కలిగిన రసాయన మందులు పిచికారి చేయాలి. మొక్కల్లో ఇనప ధాతు లోపాన్ని సరిచేస్తూ కిరణజన్య క్రియను సరిచేస్తుంది.
రాగి లోపం
రాగి లోపం కారణంగా మొక్కల ఆకులు నీలి రంగులోకి మారి ఆకుల చివరి భాగం పసుపు రంగులోకి మారి చివరకు ఎండి పోతాయి. కాయలను పట్టుకొని చుస్తే బంకలాగా అంటుకుంటుంది. దీని లోపం నివారణకు ఎకరానికి 15 కిలోల కాపర్ సల్పేట్ దుక్కిలో వేసుకోవాలి. లేదా లీటర్ నీటికి 5 గ్రాముల కాపర్ఆక్సిక్లోరైడ్ మొక్కలపై పిచికారి చేయాలి. మొక్కల్లో విటమిన్ ఏ లోపం రాకుండా రాగి కాపాడుతుంది.
బోరాన్ లోపం
మొక్కల చిగురుటాకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి మెలికలు తిరిగి వంకరగా కనిపిస్తాయి. లేత ఆకులు మందంగా తయారై ఎదుగుదల లోపిస్తుంది. కాయలపై, కాండంపై పగుళ్ళు ఏర్పడతాయి. లేత పిందెలు మాడిపోతాయి. దీని లోపం నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల బోరాన్-20%ను కలిపి పిచికారి చేసుకోవాలి. పూత పిందే రాలడాన్ని, చిగురుటాకులు క్రమ పద్ధతిలో పెరుగుదలకు బోరాన్ సహాయపడుతుంది.
కాల్షియం లోపం
కాల్షియం లోపం ఉన్న మొక్కల్లో లేత ఆకుల చివరి బాగంలో ఎండినట్లు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి. లేత ఆకులు పైకి డోప్పలాగా ముడుసుకుపోతాయి. కాల్షియం లోపం నివారణకు ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ పాస్పేట్ క్రమం తప్పకుండా వాడి కాల్షియం లోపం రాకుండా నివారించవచ్చు. మొక్కల పెరుగుదలకు, మొక్కకు వేర్లు బాగా రావడానికి, కాయలలో గింజల శాతం పెరగడానికి కాల్షియం బాగా ఉపయోగపడుతుంది.
ఇనుము లోపం
మొక్కల లేత ఆకులలో ఇనుపధాతు లోపం కనిపిస్తుంది. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారుతుంది. వాతావరణం బెట్టగా ఉన్నపుడు మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. చౌడు నేలల్లో కూడా ఇనుము లోపం కనిపిస్తుంది. దీని నివారణకు గాను ఆకులపై 3.0%ఉన్న ఐరన్ సల్పేట్ ను వారంలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. ఆకుల్లో పత్రహరితం కోల్పోకుండా కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రాకల పోషకాలను మొక్కలకు అందిస్తుంది.
జింక్ లోపం
జింక్ లోపం ఉన్న మొక్కల్లో కణుపుల దూరం తగ్గడం, ఆకుల చివరి అంచులు ఎండినట్లు కనిపించడం, ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడుతుంది. జింక్ లోపం నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్పేట్ వేసుకోవాలి. పంటలో లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి 1గ్రాము సిలెటెడ్ జింక్ ను రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. మొక్కలు గిడసబారి పోకుండా నత్రజని ఎరువులను మొక్కలకు అందిస్తుంది. లేత మొక్కలకు తగిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది.
మాలిబ్డనం లోపం
మాలిబ్డనం లోపం మొక్కల ముదురు ఆకులలో కనిపిస్తుంది. మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పసుపు రంగులోకి మారి నత్రజని లోపం ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఆకులపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని లోపం నివారించడానికి 0.2 శాతం అమోనియం మాల్డిబేట్ ను పిచికారి చేసుకోవాలి. మొక్కలకు నత్రజని వినియోగాన్ని అందించడంలో మాలిబ్డనం సహాయపడుతుంది. ఇనుముధాతు లోపం రాకుండా మొక్కలను రక్షిస్తుంది.
నత్రజని లోపం
నత్రజని లోపం కారణంగా మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పసుపు రంగులోకి మారిపోతాయి. ముదురు ఆకులు ఎండిపోతుంటాయి. నత్రజని లోపం నివారణకు యురియ అమోనియం కలిసిన ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవచ్చు. మొక్క పుట్టినప్పటి నుంచి చివరి వరకు నత్రజని అవసరం ఉంటుంది. మొక్కలకు ప్రోటిన్స్ అందించడంలో సహాయపడుతుంది.
పోటాష్ లోపం
పోటాష్ లోపం మొక్కల ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులపై తుప్పు మచ్చలు కనిపిస్తాయి. పోటాష్ లోప నివారణకు మురేట్ ఆఫ్ పోటాష్ ఆఖరి దుక్కిలో ఎకరానికి 50 నుండి 70 కేజీల వరకు తగ్గకుండా వేసుకోవాలి. వాతావరణంలో హెచ్చు తగ్గుల నుంచి మొక్కలను కాపాడుతుంది. కాయలలో గింజల నాణ్యతను పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
భాస్వరం లోపం
భాస్వరం లోపం కారణంగా మొక్కల ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల ఉండవు. ఆకులు నీలి రంగులోకి మారి నిలబడి ఉంటాయి. భాస్వరం లోపం నివారణకు “సింగిల్ సూపర్ పాస్పేట్” ను ఎకరానికి ఆకరి 100 కిలోలు తగ్గకుండా వేసుకొని లోపాన్ని నివరించవచ్చు. లేతమొక్కల్లో వేరు వ్యవస్థ పెరగడానికి సహాయపడుతుంది. మొక్కలకు ప్రోటిన్స్ సమపాళ్ళలో అందిస్తుంది.