ఈ యేడాది వాతావరణ మార్పులతో మామిడిలో దిగుబడి గణనీయంగా తగ్గింది. అయితే, చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో మామిడి కోతతోపాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మామిడి పండ్ల కోత సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా అపార నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిల్వ, రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
ఎంపికే కీలకం..
లేత ఆకు పచ్చ రంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్ (చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. అది కూడా ఉదయం 10 లోగా కోత పని పూర్తి చేయాలి. కాయమీద ఉండే చర్మానికి సొన (జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే, కాయ కోసిన తర్వాత తప్పనిసరిగి సొన (జిగురు) కార్చేలా చూడాలి. ఇందుకోసం కాయ తొడిమెలను 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ. వరకు పదునైన కత్తెరతో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి, రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయలనుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీ
తగలకుండా జాగ్రత్త పడాలి.
శుద్ధి చేయాల్సిందే!
అపెడా (APEDA) సంస్థ ధృవీకరించిన ప్యాక్హౌస్లోనే మామిడి కాయలను శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 52 సెం.గ్రే. ఉష్ణోగ్రత గల నీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైట్ కలపాలి. ఈ ద్రావణంలో కాయలను ఉంచి, 2-3 నిమిషాల పాటు శుద్ధి చేయాలి. రవాణా సమయంలో అంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48 +0.3 సెం.గ్రే. ఉష్ణోగ్రత కలిగిన నీటిలో 60 నిమిషాలు శుద్ధిచేయాలి. ప్యాకింగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డ్ (సైజు 390 * 260 * 150) బాక్సులను వాడాలి. వీటిని ఆరు గంటలలోపే ప్యాక్ హౌస్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను మళ్లీ వాడాల్సి వస్తే.. వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.