Toor daal Cultivation | కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని మధుమేహులు కూడా హాయిగా తినచ్చు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల బ్లోటింగ్ సమస్యలు రాకుండా ఉంటాయి. కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. తెలంగాణలో దాదాపు 3 లక్షల హెక్టర్ల విస్తీర్ణంలో కంది సాగు చేస్తున్నారు. కందిలో వచ్చే పలు రకాల తెగుళ్లు, చీడపీడలు ఆశించడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతున్నది. ఫలితంగా రైతుల ఆదాయం తగ్గిపోతున్నది. అయితే, కంది పంటకు ఆశించే వివిధ రకాల తెగుళ్లు, అవి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు, నివారణ, యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు.
కంది పంటను ఖరిఫ్, రబీలో పండించవచ్చును. ఖరీఫ్లో రకాన్ని బట్టి 150-180 రోజులు, రబీలో 130-140 రోజులు పంట కాలం కలిగి ఉంటుంది. ఎర్ర చలక, నల్లరేగడి నేలలు, మురుగు నీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలం. ఖరీఫ్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు, రబీ 15 సెప్టెంబర్ నుంచి 15 అక్టోబర్ వరకు ఈ పంటనుసాగు చేసుకోవడానికి అనువైన రోజులు.
రకాలు
ఎల్ఆర్జీ-30 (పల్నాడు), లక్ష్మీ (ఐసీపీఎల్-85063), దుర్గా (ఐసీపీఎల్-84031), పీఆర్జీ-100, ఎమ్ఆర్జీ-66, ఎల్ఆర్జీ-41. ఆశ (ఐసీపీఎల్-87 119), అభయ (ఐసీపీఎల్-332), మారుతి (ఐసీపీ-8863) వంటి రకాలు ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చును.
విత్తనశుద్ధి
మొదటగా విత్తనాలకు థైరామ్ లేదా కాప్ఠాన్ ఒక కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున పట్టించాలి. ఆ తర్వాత విత్తుకొనే ముందు 200 నుంచి 400 గ్రాముల రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
విత్తే దూరం
ఖరీఫ్ లో నల్లరేగడి భూమిలో సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ. ఎర్ర చెలక భూమిలో సాలుకు మధ్య 90 లేదా 120 సెం.మీ. మొక్కకు-మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. రబీలో నల్లరేగడి భూముల్లో సాలుకు-సాలుకు మధ్య 75 లేదా 90 సెం.మీ. మధ్యస్థ, ఎర్ర చలక భూముల్లో సాలుకు-సాలుకు మధ్య 45 లేదా 60 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి.
విత్తు పద్ధతి
నేలను ఒకసారి దున్ని తర్వాత రెండు సార్లు గోర్రుతోలి చదను చేసి విత్తుకోవాలి. సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి. నాగలితో విత్తుకున్నప్పుడు జంట గింజలు పడకుండా సమంగా పడేలా చూసుకోవాలి.
సమగ్ర ఎరువులు
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొదళ్ళను రోటవేటర్తో కలియదున్నాలి.
రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలి. 100 మీ.లీ నీటిలో 10 గ్రా. ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేట్లు జాగ్రత్త వహించవలెను.
తొలకరి కందికి ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరవులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అంటే, 18 కిలోల యూరియా, 125 కిలోల సింగల్ సూపర్ ఫాస్పెట్ లేదా 50 కిలోల డీఏపీని వాడాలి. రబీ కందికి 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులు వేయాలి.
పూర్తి నత్రజని మరియు భాస్వరం ఏరవులను తప్పనిసరిగా విత్తనంతో పాటు గాని లేదా ఆఖరి దుక్కిలో గాని వేసుకోవాలి.
నీటి యాజమాన్యం
ఖరీఫ్లో వర్షాధారంగా పండిస్తారు. ఆవకాశమున్నచోట పూత, కాయ తయారయ్యే దశలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. రబీలో కందికి దాదాపు 250-300 మి.మీ. నీరు అవసరమవుతుంది. మొగ్గ రాబోయే ముందు, కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు ఇవ్వాలి. బెట్టకు గురైనప్పుడు యూరియా 20 గ్రా. లేదా 10 గ్రా. మల్టి-కె లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పూత, కాత రాలిపోకుండా కాపాడవచ్చు.
పంటకోత
కంది రకాన్ని బట్టి పూత దశ నుంచి 45-60 రోజులలో పంట పరిపక్వతకు వస్తుంది. కాయులు పసుపు రంగుకు ఆ తర్వాత పూర్తిగా తయారయిన తర్వాత నలుపు ఛాయకు మారుతాయి. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ ఫాస్ 25 ఇసి 2.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడుకోవచ్చు. 80 శాతం కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత పంట కోయవలెను.