మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి. వీటినే అకాకరకాయ, అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. చూసేందుకు మామూలు కాకరకాయల మాదిరిగానే ఉన్నా వీటి రుచిలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ధర కాస్తా ఎక్కువగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు సెలవిస్తున్నారు. వానాకాలంలో విరివిగా దొరికే ఈ కాకరకాయలను తినడం వల్ల భయంకర క్యాన్సర్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
బోడ కాకర అటవి ప్రాంతాలలో సహజంగా దొరికేవి. బీడు బూముల్లో , పర్వత ప్రాంతాల్లో, తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మనకు లభిస్తుంటాయి. మార్కట్లో ఈ బోడ కాకరకాయకు మంచి గిరాకి ఉంటుంది. కిలో రూ.200 నుంచి 250 వరకు ధర పలుకుతుంది. వీటిని పండించడం ద్వారా బోలెడు లాభాలను అందుకోవచ్చు.
ఎకరం బూమిలో బోడ కాకరకాయ పంట సాగు చేసేందుకు మంచి దుంపలను గుర్తించి తొలకరి వర్షాలు పడినప్పుడు సేకరించుకోవాలి. ప్రత్యేకంగా విత్తనం కోసం సాగుచేసి అక్టోబర్ నెలలో పండ్ల నుంచి గింజలను తీసిపెట్టుకోవాలి. ఈ గింజల్లో తేమ శాతం పూర్తిగా తగ్గే వరకు అరబెట్టాలి. ఇనుప డబ్బాల్లో కాకుండా గుడ్డ సంచిలో మూట కట్టి నిల్వ చేసుకోవడం చాలా మంచిది. ఎకరం భూమిలో బోడ కాకరకాయ సాగు చేయడానికి 8-10 కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తనశుద్ధి
సేకరించిన విత్తనాలను నాటుకోవడానికి మూడు గంటల ముందు కిలో విత్తనానికి Captan-70 శాతం WP, 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి జరపాలి లేదా Imdaclopride-70 శాతం WG, 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
దుక్కితయారి
మంచి దిగుబడి పొందేందుకు ఎకరాకు 5-8 టన్నుల పశువుల ఎరువు వేసి నాలుగు సార్లు బాగా కలియదున్నుకోవాలి. ఆకరి దుక్కిలో 25 కేజీల భాస్వరం, 30 కేజీల పోటాష్, 15 కేజీల నత్రజని, 10 కేజీల జింక్ సల్పేట్ వేసుకొని 2-3 మీటర్ల వెడల్పుతో బోదెలు తోలుకోవాలి.
విత్తనం నాటుట
ఖరిప్ (వానాకాలం) లో జూన్ రెండో వారంలో విత్తుకోవాలి. రబీ (వేసవి) లో నవంబర్ మొదటి వారంలో వేసుకోవాలి.
విత్తుకునే విధానం
వీటి గింజల్లో మొలక 30 శాతం మాత్రమే ఉంటుంది. అందుకని రైతులు బోదెలు తోలుకున్న తర్వాత బోదెలకు కొంచం దిగువ భాగంలో పాదుల పద్ధతిలో విత్తుకోవాలి. పాదుకు పాదుకు 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ప్రతి పాదుకు 7-10 గింజలు విత్తుకోవాలి.
మొక్కలు గుర్తించుట
గింజలు మొలకెత్తిన తర్వాత 6-7 అడుగుల ఎత్తులో నిలువు పందిళ్ళు వేసుకోవాలి. అడ మొక్కల కంటే ముందే మగ మొక్కలు పూత దశకు వస్తాయి. మగ మొక్కలను గుర్తించి ఎకరం పంటలో 5-10శాతం మాత్రమే మగ మొక్కలు ఉంచి మిగితా మగ మొక్కలను తొలగించి వేయాలి.
రసం పీల్సే పురుగులు
గింజలు మొలకెత్తిన 20 రోజుల నుంచి రసం పీల్సే పురుగులు ఆకుల క్రింది భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు డొప్పల మాదిరిగా ముడుచుకు పోతాయి.
నివారణ : Fipronil- 5 శాతం SC మందును లీటర్ నీటికి 5ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా Difenthiuron- 50 శాతం WP మందును లీటర్ నీటికి 0.25 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.
పాండకు తెగులు
ఖరిప్ సీజన్లో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పాండకు తెగులు సోకి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.
నివారణ : పాండకు తెగులు నివారణకు Mancozeb – 75 శాతం WP మందును లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.
కాయ తోలుచు పురుగు
బోడ కాకర కాయలకు పచ్చపురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పిందెలను కొరికి తింటుంది. కాయలకు రంద్రాలు చేసి నష్టం చేస్తుంది.
నివారణ : ఈ పురుగును నివారించడానికి Chlorantraniliprole-18.5 శాతం SC మందును లీటర్ నీటికి 0.6ml చొప్పున కలుపుకొని సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. లేదా Emamectinbenzoate-5 శాతం SG మందును లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి.
దిగుబడి
30 రోజులకు పూత దశకు వస్తాయి. 40 రోజుల తర్వాత మొదటి కోత కోసుకోవచ్చు. ఒకసారి కాయలు కోసిన తర్వాత ప్రతి వారం రోజులకు ఒకసారి కోత వస్తుంది. ఇలా 35-40 రోజుల వరకు కాత వస్తుంది. ఎకరాకు 90-120 కిలోల దిగుబడి వస్తుంది.