సాగుపై సరైన అవగాహన, మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే.. వ్యవసాయంలోనే అధిక సంపాదన ఉంటుందని యువరైతులు నిరూపిస్తున్నారు. మూస ధోరణిని వదిలిపెట్టి, అధునిక సాంకేతికతతో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన యువరైతు శ్రీకాంత్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. డిగ్రీ చదివినప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, వ్యవసాయంలో రాణిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాడు.
శ్రీకాంత్ డిగ్రీ తర్వాత బెంగళూరులో డీఎడ్ చేశాడు. అయితే, ఏ రోజు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయలేదు. శ్రీకాంత్ కుటుంబం.. తరతరాల నుంచి వ్యవసాయాన్నే నమ్ముకున్నది. దీంతో అతను కూడా ఆవైపుగానే అడుగులు వేశాడు. తమకున్న 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాడు. సీజన్ను బట్టి పంట మార్పిడి చేస్తూ.. అధిక ఆదాయం పొందుతున్నాడు.
సంప్రదాయానికి భిన్నంగా ఇతర పంటలవైపు మళ్లాడు శ్రీకాంత్. 20 ఎకరాల్లోనూ వివిధ రకాల పూలు, కూరగాయలు సాగు చేస్తూ, పెట్టుబడికి మించి రెండింతలు సంపాదిస్తున్నాడు. సాగుపై పూర్తి అవగాహన, నైపుణ్యంతో పంటలు పండిస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. ఐదెకరాల్లో చామంతి పూలు సాగు చేస్తూ రూ. 10 లక్షల నుంచి 15 లక్షల దాకా సంపాదిస్తున్నాడు.
గత ఐదేళ్లుగా చామంతి పూలు, కూరగాయలు పండిస్తున్నా. వ్యవసాయం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నా. వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకొని రైతుగా బతకడం గర్వంగా ఉంది. వ్యవసాయంలో ముందుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. వేయాలనుకున్న పంటలపై అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ను అంచనా వేయాలి. అప్పుడే నష్టాల మాట వినిపించదు. సీజన్ను బట్టి పంట మార్పిడి చేస్తూ, లాభాలను
ఆర్జిస్తున్నాను.
-సీహెచ్. శ్రీకాంత్, యువ రైతు.
విద్యావంతుడైన శ్రీకాంత్.. సాగుపై పూర్తి అవగాహన పెంచుకుంటున్నాడు. మొక్కలకు సేంద్రియ ఎరువులే వేస్తుంటాడు. కూలీల కొరత లేకుండా.. మూడు నెలల ముందుగానే వారికి అడ్వాన్స్గా డబ్బులు చెల్లిస్తాడు. మార్కెటింగ్ను కూడా స్వయంగా పర్యవేక్షిస్తాడు.
-ఉప్పరి రాఘవేందర్