పూలసాగుతో అధిక ఆదాయం
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు.. సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎకరం తోటలో రూ. లక్ష దాకా ఆదాయం ఆర్జిస్తూ ‘ఔరా!’ అనిపిస్తున్నాడు. సంప్రదాయ సాగులో వచ్చిన నష్టాలను.. పూల తోటలతో పూడ్చుకుంటున్నాడు. భారీ లాభాలతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లాలో పూల సాగు ఏటేటా పెరుగుతున్నది. ప్రభుత్వం ఇతర పంటల సాగుపై విస్తృత ప్రచారం కల్పిస్తుండటంతో రైతులు కూడా ఆ దిశగా మళ్లుతున్నారు. అధిక లాభాలు అందిస్తున్న కారణంగా కూరగాయలు, పూల సాగుకు మొగ్గు చూపుతున్నారు. శంకర్పల్లి మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన రైతు బాల్రాజు.. పూల తోటల ద్వారా ఎకరానికి రూ.లక్ష దాకా సంపాదిస్తున్నాడు.
ఆ పంటలతో నష్టం..
బాల్రాజు నాలుగేళ్లుగా గులాబీ, చామంతి, బంతి పూల తోటలను సాగు చేస్తున్నాడు. గతంలో పత్తి, మొక్కజొన్న సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో నష్టాల బారినుంచి తప్పించుకునేందుకు పూల సాగువైపు మళ్లాడు. పూల సాగుపై అవగాహన లేకపోయినప్పటికీ తొలుత 4 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు నాటాడు. మంచి లాభాలు రావడంతో ఈ ఏడాది మిగతా 4 ఎకరాలకూ విస్తరించాడు. తమిళనాడు నుంచి గులాబీ, చామంతి మొక్కలను తీసుకువచ్చి సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల చొప్పున, 8 ఎకరాలకు రూ.4 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి, భారీ దిగుబడులు సాధిస్తున్నాడు. కేవలం గులాబీలతోనే పెట్టుబడి ఖర్చులు పోను, ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం పొందుతున్నాడు. వేసవిలో దిగుబడులు తగ్గినప్పటికీ, ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లాభాన్ని ఆర్జిస్తున్నాడు. సంప్రదాయ పంటల సాగులో వచ్చిన నష్టాలను పూడ్చుకుంటూ, మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నాలుగేళ్లుగా..
గతంలో పత్తి, మక్కజొన్న, కూరగాయల పంటలను సాగు చేసి తీవ్రంగా నష్టపోయా. అప్పుల బారిన పడ్డా. దీంతో పంట మార్పిడి చేయాలని ఆలోచించి, తమిళనాడు నుంచి గులాబీ మొక్కలను తీసుకువచ్చి సాగు చేశా. మొక్కలు బాగా పెరిగి, మంచి దిగుబడులు వచ్చాయి. పెట్టుబడులు పోను ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వచ్చింది. ప్రతిరోజూ 20 మంది కూలీలకు పని కల్పిస్తున్నా. అన్ని ఖర్చులూ పోను ఏడాదికి సుమారు రూ.20 లక్షల లాభం వస్తున్నది.
-బాలరాజ్, రైతు.
…?ఉప్పరి రాఘవేందర్