పశువులకు గడ్డిని మామూలుగా వేయడం కంటే.. కత్తిరించి వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశుగ్రాసాన్ని కత్తిరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
పశువులకు గడ్డిని మామూలుగా వేయడం కంటే.. కత్తిరించి వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశుగ్రాసాన్ని కత్తిరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
పశుగ్రాసాన్ని కత్తిరించి వేయడం వల్ల మామూలు కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువగా తింటాయి. దీంతో 5 -10 శాతం పాల దిగుబడి పెరుగుతుంది.
మామూలుగా పశుగ్రాసం కాండం పెద్దగా, లావుగా, ఆకులు వెడల్పుగా, పొడవుగా ఉంటాయి. దీనివల్ల పశువులు వీటిని పూర్తిగా తినలేవు. లేత ఆకులు, కాండాలను మాత్రమే తిని, మిగతా భాగాన్ని వదిలేస్తాయి. తర్వాత ఆ కాండాలు మల మూత్రాలతో కలిసిపోయి, నిరుపయోగంగా మారుతాయి. అదే.. కత్తిరించి వేయడం వల్ల మేత వృథా కాదు.
పశువులు కత్తిరించిన గడ్డిని తినడానికి, నెమరు వేసుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
జొన్నచొప్పను, వరిగడ్డిని కూడా కావాల్సిన సైజుకు కత్తిరించి మేతగా వేయవచ్చు. ఎండుగడ్డిని అర అంగుళం సైజులో కత్తిరించి మేతగా వేయడం వల్ల కేవలం పచ్చిమేత కాకుండా ఎండుగడ్డిని కూడా పశువులు తీసుకుంటాయి. దీనివల్ల వాటి శరీరానికి కావాల్సిన పీచుపదార్థాలు సంపూర్ణంగా అందుతాయి.
పలు రకాల పశుగ్రాసాలను ఒకేసారి మేతగా అందించినప్పుడు.. పశువులు వాటికి ఇష్టమైన గడ్డిని మాత్రమే తింటాయి. మిగతాది వృథా అవుతుంది. దీనివల్ల వాటి శరీరానికి కావాల్సిన పదార్థాలు కొంతమేర అందకపోవచ్చు. అందువల్ల అన్నిరకాల పశుగ్రాసాలను ముక్కలుగా కత్తిరించి ఇవ్వడం వల్ల.. పశుగ్రాసాన్ని మొత్తంగా తీసుకుంటాయి. దీన్ని ‘సెలెక్టివ్ ఫీడింగ్’ అంటారు.
పశుగ్రాసాన్ని కోసిన తర్వాత డెయిరీ ఫాం, పశువుల కొట్టాల్లో నిల్వ చేసుకోవాలంటే ఎక్కువ స్థలం కావాలి. అదే కత్తిరించిన గ్రాసాన్ని బస్తాల్లోగాని లేదా గంపల్లో గాని నింపి, తక్కువ స్థలంలోనే సులభంగా నిల్వచేయవచ్చు. రవాణా కూడా సులభం.