హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పంటలను మార్కెట్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కమీషన్ ఇచ్చే పనిలేదు. తరుగుకు అవకాశం అసలే లేదు. పంట కోసిన చోటే రైతుల ఉత్పత్తి సంఘాల(ఎఫ్పీసీ) సేకరణ. మార్కెట్ రేటుతో సమానంగా ధర చెల్లింపు. ఫలితంగా రైతుకు అదనపు లాభం. ఎఫ్పీసీలు సమన్వయకర్తగా వ్యవహరించటంతో ప్రాసెసింగ్ కంపెనీ కిలోకు మూడు నుంచి ఐదు రూపాయల వరకు చెల్లిస్తుండటంతో వాటికీ లాభం. ఇలా ఖమ్మం జిల్లాలో మూడు రైతుల ఉత్పత్తి సంఘాలు కేవలం రెండు నెలల్లో కమీషన్ రూపంలో రూ.96 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి చివరి వరకు రూ.39.19 కోట్ల విలువైన 2,147 టన్నుల మిర్చిని సేకరించి ప్లాంట్ లిపిడ్స్ సంస్థకు అందజేశాయి.
12 కొనుగోలు కేంద్రాలు
ఖమ్మం జిల్లాలో తేజ రకం సన్న మిర్చి అత్యధికంగా సాగవుతుంది. ఈ రకం మిర్చిలో గింజ ఎక్కువ ఉండటంతో నూనె ఉత్పత్తి ఎక్కువ. ఈ నూనెను ప్లాంట్ లిపిడ్స్ సంస్థ విదేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సమీపంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో సంస్థ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసింది. ఖమ్మం జిల్లా రైతుల నుంచి మిర్చి కొనుగోలుకు ప్రభుత్వంతో సంస్థ సంప్రదింపులు జరిపి ఎఫ్పీసీల ద్వారా సేకరించడానికి సెర్ప్తో ఒప్పందం చేసుకున్నది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎఫ్పీసీలు, రైతులకు అవగాహన కల్పించారు. కామేపల్లి, ఏన్కూరు, సింగరేణి, మధిర, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రైతులను సమన్వయం చేయడం కోసం ఏన్కూరు మండలం సిరివెన్నెల ఎఫ్పీసీ, మధిర మండలం మధిర ఎఫ్పీసీ, కొణిజర్ల మండలం ఆదర్శ ఎఫ్పీసీలకు కంపెనీ కమీషన్ చెల్లించింది.
రైతులకూ అనేక లాభాలు
కల్లాల దగ్గరే నేరుగా కొనుగోలు చేయడంతో రైతులకు రవాణా ఖర్చులు మిగిలాయి. మార్కెట్కు వెళ్తే కొనుగోలుదారులు కమీషన్ తీసుకుంటారు. ఇక్కడ ఆస్కారం లేదు. తరుగు సైతం తీయలేదు. మార్కెట్లో బస్తాలు జోకినప్పుడు కిలోలకు అదనంగా వచ్చే గ్రాములను లెక్కలోకి తీసుకోకుండా రౌండ్ఫిగర్ చేసి డబ్బులు చెల్లిస్తారు. ఎఫ్సీలు మాత్రం 100, 200, 300 గ్రాములకు ధర కట్టాయి. ఇలా రైతులకు నాలుగైదు రకాలుగా లబ్ధి చేకూరింది. పరోక్షంగా మార్కెట్ ధర కంటే ఎక్కువే పలికింది. మిర్చి నాణ్యత ఆధారంగా ధర నిర్ణయించి బహిరంగ మార్కెట్లో ఉన్న రేటును ప్లాంట్ లిపిడ్స్ చెల్లించింది. సెర్ప్ స్థాపించిన బెనిషాన్ ద్వారా రైతులకు నేరుగా ఖాతాల్లో సొమ్ము జమచేశారు. ముందుజాగ్రత్తగా కలెక్టర్ వద్ద ప్లాంట్ లిపిడ్స్ కోటి రూపాయలను డిపాజిట్ చేయడంతో రైతులకు నమ్మకం కలిగింది. వచ్చే ఏడాది ఆరు వేల టన్నుల మిర్చిని సేకరించాలని ఎఫ్పీసీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పసుపును కూడా సేకరించాలని నిర్ణయించారు.
రైతులకు, ఎఫ్పీసీకీ లాభం
పంటలకు మంచి ధర రావాలన్నదే మా ఉద్దేశం. ప్రైవేటు కంపెనీ మిర్చి కొనుగోలు చేయడానికి ముందు కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టారు. డబ్బులు రావోమోనని మొదట రైతులు భయపడ్డారు. తరువాత మా దగ్గర కొనండని ఆహ్వానించారు. ఎఫ్పీసీకి కిలోకు మూడు నుంచి ఐదు రూపాయల వరకు స్లాబ్సిస్టంలో కమీషన్ ఇచ్చారు. ఈ డబ్బుతో ఎఫ్పీసీని బాగు చేసుకుంటాం.
– స్వర్ణ కృష్ణవేణి, సిరివెన్నెల ఎఫ్పీసీ అధ్యక్షురాలు
రైతులంతా సంతోషంగా ఉన్నరు
బేరగాళ్ల దగ్గర 38 కిలో ల 900 గ్రాములు కాంటా అయితే, 900 గ్రాములను లెక్కలోకి తీసుకోరు. కానీ ఎఫ్పీసీ ద్వారా కంపెనీ కొనుగోలు చేయడంతో ప్రతిగ్రాముకు లెక్కలో చూపెట్టాం. దీని ద్వారా కూడా రైతులకు లాభం జరిగింది. కమీషన్ కూడా లేదు. ఈ విధానాన్ని ప్రొత్సహించాలి. రైతులంతా సంతోషంగా ఉన్నరు.
– ఎస్ నాగధరావు, రైతు, జిన్నారం, ఏన్కూరు మండలం
ఇతర పంటల కొనుగోలుకు కార్యాచరణ
ఇప్పటి వరకు మహిళా సంఘాలు, ఎఫ్పీసీలు ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. తొలిసారి మిర్చి కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. మిర్చి నుంచి నూనె తీసే కంపెనీ కొనుగోలుకు ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని ఎఫ్పీసీల ద్వారా చేయించాం. వాళ్లు కష్టపడి పనిచేసి రెండు నెలల్లోనే 96 లక్షలు సంపాదించారు. రాబోయే రోజుల్లో ఇతర పంటలను కూడా ఎఫ్పీసీల ద్వారా సేకరించాలని నిర్ణయించాం.
– సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి