డ్రాగన్ఫ్రూట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండులో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధ వ్యాధులకు, అజీర్ణ సమస్యలకు ఈ పండు ఔషధంగా పనిచేస్తుంది. ఈ పంట రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పంట సాగు విస్తీర్ణం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది.
డ్రాగన్ ఫ్రూట్కు మార్కెట్లో మంచి డిమాండు ఉన్నది. దీంతో రైతులు ఈ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట సాగు చేస్తే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉన్నది. తైవాన్ దేశంలో పండే ఈ పంటకు మన దేశ నేలలు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. విత్తిన ఏడాదిన్నర లోపు పంట చేతికి వస్తుంది. మొదటి సంవత్సరం నుంచే మంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఎకరాకు నాలుగు టన్నుల డ్రాగన్ఫ్రూట్ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పంట సాగులో ఎరువులుగా పశువుల పేడ మాత్రమే వాడటం వల్ల మరింత ఎక్కువ దిగుబడి ఆశించవచ్చు. ఒక్కసారి విత్తితే దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుంది.
ఈ పంట సాగు చేయడానికి తొలుత చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కసారి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తే 30 సంవత్సరాల వరకు ఏటా పంట తీసుకోవచ్చు. జంతువులు ఏవీ ఈ పండ్లను తినవు. చీడపీడల బెడద కూడా చాలా తక్కువ. రైతులకు అన్ని విధాలు లాభం చేకూర్చే పంట. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ పంట సాగు చేస్తారు. దాంతో పండు చాలా రుచిగా ఉంటుంది. ఈ పండుకు మార్కెట్లో కిలోకు రూ.200 వరకు ధర పలుకుతున్నది. ఒకసారి పెట్టు బడి పెడితే ఏటా లాభాలే తప్ప నష్టాలు ఉండవు.
సాగు పద్ధతులు
ఈ పంట సాగు చేయడానికి ముందు భూమిని చదును చేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించాలి. నేలలో ఉదజని 7 శాతం ఉంటే సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మూడుసార్లు భూమిని దున్నాలి. తర్వాత 10 ఫీట్ల దూరంలో సాలు తోలాలి. అడ్డం నాలుగు ఫీట్ల దూరంలో 7 ఫీట్ల ఎత్తు ఉన్న సిమెంట్ స్తంభాలను నాటుకోవాలి. సిమెంట్ స్తంభంపై భాగంలో రౌండుగా ఉండే ఒక సిమెంట్ బిల్లను అమర్చాలి. ఎకరానికి 500 సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను నాటే ముందు పాదు దగ్గర పశువుల పేడ వేయాలి. మొక్కలు కింద పడిపోకుండా టైరుతో సిమెంట్ కట్టాలి. మొక్కలను నాటడానికి రెండు నుంచి మూడు ఫీట్ల లోతులో పాదు చేసుకోవాలి. ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పురుగు మందులు వాడవలసిన అవసరం లేదు. డ్రిప్ విధానం ద్వారా నీళ్లను అందివ్వవచ్చు.
మంచి లాభాలు
రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. రైతులకు మంచి లాభాలు వస్తాయి. పంట వేసిన్నప్పుడు మాత్రమే ఎకరాకు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఖర్చు ఉండదు.