ఎకరం భూమిలో కనకాంబరాలు సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా తోటలో పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటివల్ల మొక్కలు దెబ్బతింటున్నాయి. వీటినివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయగలరు.
– రత్నాకర్ రెడ్డి, వికారాబాద్.
కనకాంబరాలు ఏడాది పొడవునా పూస్తాయి. ఈ పూలకు ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం ఉంటుంది. అందుకే, ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో రైతులు కనకాంబరాలను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, నులి పురుగులు, పిండినల్లి పురుగులు ఆశించడం వల్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది.
నులి పురుగులు
నులి పురుగులు మొక్కల వేర్లలో రంధ్రాలు చేస్తాయి. ఫలితంగా వేర్లపై బుడిపెలు ఏర్పడుతాయి. వీటివల్ల ఎండు తెగులు సోకే అవకాశం కూడా ఉంటుంది. మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేర్ల వద్ద వేసి, మట్టిని ఎగదోయాలి. బంతి పూలతో పంటమార్పిడి చేస్తే నేలలో నులిపురుగుల సంఖ్య తగ్గుతుంది.
పిండినల్లి పురుగు
పూల తోటలను తీవ్రంగా నష్టపరిచే వాటిలో పిండినల్లి ఒకటి. ఇవి లేత కొమ్మలు, ఆకులు, పూమొగ్గలపై తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. గుంపులుగా చేరి ఆకులు, పువ్వుల్లో రసం పీలుస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ (రోగార్) లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ను 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.