హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు సాగు చేసిన విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఇదే విషయం అర్థమవుతున్నది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 5.19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఈ సీజన్లో ఇప్పటికే 8.34 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే ఇది 3.15 లక్షల ఎకరాలు ఎక్కువ. పప్పు, నూనెగింజలతో పాటు మక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే నూనె గింజల సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. నూనెగింజల్లో అత్యధికంగా పల్లి సాగు జోరు కనిపిస్తున్నది. పల్లీలు గతేడాది ఇదే సమయానికి 1.36 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం 2.87 లక్షల ఎకరాలకు చేరింది. పప్పుగింజల సాగు విస్తీర్ణం గతేడాది ఈ సమయానికి 2.81 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 3.42 లక్షల ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో ఇప్పటివరకు మక్కజొన్న 94 వేల ఎకరాల్లో సాగులోకి వచ్చింది.
పశు సంవర్ధక శాఖలోని గోపాలమిత్ర సేవకులకు ప్రస్తుతం అమలుచేస్తున్న మెడిక్లెయిమ్ బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.పది లక్షలకు పెంచాలని ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో మంజువాణిని కలిసి వినతిపత్రం అందజేశారు.