ఆ రైతులది మారుమూల పల్లె అయినా.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా మారుతూ.. సాగులో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. సాగు ఖర్చును కూడా తగ్గించుకుంటూ.. పంట దిగుబడిని పెంచుకుంటున్నారు. మిర్చి పంటకు నష్టం కలిగించే తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగులకు సోలార్ లైట్లతో చెక్ పెడుతున్నారు ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం రామచంద్రాపురం రైతులు.
రామచంద్రాపురం గ్రామంలో పలువురు రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నూతన మార్గాలనూ అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పురుగుల బెడదతో మిర్చికి ఎక్కువ నష్టం వాటిల్లుతుండగా, వాటి నివారణకు సోలార్ లైట్ల ప్రయోగాన్ని అనుసరిస్తున్నారు. ఒక్కో సోలార్ లైట్ రూ. 3500తో కొనుగోలు చేసి.. ఎకరానికి ఒకటి చొప్పున మిర్చి తోటల్లో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సూర్యరశ్మితో చార్జింగ్ అయ్యే ఈ లైట్లు.. రాత్రిపూట వాటంతట అవే ఆన్ అవుతాయి. ఆ లైట్ వెలుతురుకు తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగులు వచ్చి లైట్ కింది ట్రేలో పడి.. చనిపోతాయి.
సోలార్ లైట్ల వినియోగంతో రైతులతోపాటు వినియోగదారులు కూడా లాభపడుతున్నారు. ఐదెకరాల్లో మిర్చి పంటకు పురుగుల మందు కొట్టడానికి సుమారు రూ. 25 వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. మోతాదుకు మించి రసాయన మందుల వినియోగం వల్ల భూసారంపై ప్రభావం చూపుతున్నది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. సోలార్ లైట్ల వినియోగం వల్ల రూ. 20 వేల దాకా ఖర్చు తగ్గుతున్నది. వినియోగదారులకూ రసాయన మందులు వాడని ఉత్పత్తులు అందుతున్నాయి. దీంతో ఇతర రైతులు కూడా తమ చేలలో సోలార్ లైట్లు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మారుమూల
ప్రాంతమైన వెంకటాపురం మండల రైతులు అధునాతన పద్ధతుల ద్వారా మిర్చి సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారని అధికారులు అభినందిస్తున్నారు.
మిర్చి తోటలకు ఇంతకుముందు పురుగు మందులు కొట్టేవాళ్లం. అందుకు భారీగా పెట్టుబడి పెట్టేవాళ్లం. కొన్ని సందర్భాల్లో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా, తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవాళ్లం. అందుకే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించాం. చేనులో సోలార్ లైట్లు ఏర్పాటుచేసి, పురుగుల పని పడుతున్నాం.
-నల్లూరి వెంకన్నబాబు, రైతు.
సోలార్ లైట్ల ద్వారా పురుగులను చంపడంతో మందుల ఖర్చు ఉండటం లేదు. దీంతో పెట్టుబడి డబ్బులు మిగులుతున్నాయి. అంతేకాకుండా, పురుగుల మందు వల్ల కలిగే అనర్థాలను నివారించినట్లు అవుతున్నది. సహజసిద్ధంగా పెరుగుతున్న తోటల్లో దిగుబడి పెరుగుతున్నది. కొందరు రైతులు ఈ విధానాన్ని చూసి.. తాము సోలార్ లైట్లు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-ఎన్. నర్సింహులు, రైతు.
-జాపతి శ్యాంసుందర్