అటవీ ప్రాంతాల్లోని రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. అడవిపందుల బీభత్సం. ఆహార పంటలతోపాటు అన్ని రకాల వాణిజ్య పంటలకూ అడవిపందుల ద్వారా అపార నష్టం వాటిల్లుతున్నది. జొన్న, మక్కజొన్న, వేరుశనగ పంటలను తినేయడంతోపాటు పొద్దుతిరుగుడు, చెరుకు, వివిధ కూరగాయల తోటల్లో పందులు తిరగడం వల్ల పంటలు ధ్వంసం అవుతుంటాయి. అయితే, అడవిపందుల ప్రాణాలకు ప్రమాదం రాకుండా, వాటి బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
భౌతిక పద్ధతి : పొలం చుట్టూ కంచె వేసుకోవడం ద్వారా పందుల బారినుంచి పంటలను కాపాడుకోవచ్చు.
ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. అవి..
ఇనుప ముళ్లతీగ కంచె
వలయాకార ముళ్ల కంచె
ఇనుప వల కంచె
సోలార్ ఫెన్స్
ఈ కంచెలను పొలం గట్టు వెంట పంటకు ఒక అడుగు దూరంలో వేసుకోవాలి. ఇందుకోసం వెదురు గడలు లేదా సిమెంట్ స్తంభాలను పాతుకొని, ఒక అడుగు నుంచి మూడు అడుగుల ఎత్తువరకూ కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏర్పాటు అడవిపందులు పొలంలోకి రాకుండా నిరోధిస్తుంది. ఇక సోలార్ ఫెన్సింగ్ పద్ధతిలో 12 వోల్టుల విద్యుత్ను ఉత్పత్తి చేసే సోలార్ ప్లేట్లను పొలం వద్ద అమర్చుకోవాలి. పొలం చుట్టూ ఏర్పాటుచేసిన ఫెన్సింగ్కు సోలార్ విద్యుత్ను ప్రసారం చేయాలి. దీంతో అడవిపందులకు చిన్నపాటి షాక్ తగిలి అవి పొలాల్లోకి రావడానికి జంకుతాయి.
కందకం : పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్టు వెంట రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు లోతున కందకాలను తవ్వుకోవాలి. దీంతో అడవిపందులు పొలంలోకి ప్రవేశించలేవు.
వల ఏర్పాటు : 6 అడుగుల వెడల్పు కలిగిన నైలాన్ వలను పంటపొలం చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం వెదురు బొంగులు పాతుకొని, మూడు అడుగుల ఎత్తు ఉండేలా వలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో వల గోడలా ఉంటూ.. అడవిపందుల బారినుంచి పంటలను రక్షిస్తుంది.
ఫోరేట్ గుళికలు : కిలో పొడి ఇసుకలో 200 గ్రా.ల ఫోరేట్ గుళికలను కలిపి ఒక గుడ్డ సంచిలో కానీ, చిన్నచిన్న రంధ్రాలు చేసిన ప్లాస్టిక్ సంచిలో కానీ మూటగట్టాలి. వీటిని పొలం చుట్టూ 3 మీటర్లకు ఒకటి చొప్పున కర్రలు పాతి, 60 నుంచి 100 సెం.మీ.ల ఎత్తులో ఈ మూటలను వేలాడగట్టాలి. వీటినుంచి వచ్చే వాసనకు అడవిపందులు పారిపోతాయి.
కుళ్లిన కోడిగుడ్ల ద్రావణం : లీటర్ నీటిలో 20 మి.లీ. కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని కలపాలి. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పులో చదును చేసి, తడి భూమిపై ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ ద్రావణం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
జీవ కంచెలు : ఈ విధానంలో పొలం చుట్టూ 4-5 వరుసల్లో కుసుమ లేదా ఆముదం పంటలను వేసుకోవాలి. కుసుమ పంటకు ఉండే ముళ్లు, ఆముదం వాసన అడవిపందులకు పడదు. దీంతో ప్రధాన పొలంలోకి రాకుండానే వెనుదిరుగుతాయి. అలాగే వివిధ ముళ్లజాతి మొక్కలైన రేగు, అగేవ్, కాక్టస్, గచ్చకాయ, వాక్కాయ వంటివాటినీ పొలం చుట్టూ నాటడం ద్వారా అడవిపందులను అడ్డుకోవచ్చు.