ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. కానీ, మితిమీరిన పురుగు మందుల వినియోగంతో.. ఆకుకూరలు విషతుల్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రైతులు పురుగు మందులను తకువగా వాడుకోవాలని రాజేంద్రనగర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకురాలు డాక్టర్ ఎం.విజయ సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులలో కొన్ని మందులను సరైన పద్ధతులు, మోతాదులో వాడుకోవచ్చని చెబుతున్నారు. ఆయా రకాల ఆకుకూరలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల గురించి వివరిస్తున్నారు.
మెంతికూర
మెంతికూరలో మొదలుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ తెగులు భూమిలో ఉండే రైజోకోనియా సొలాని అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది. కాండం మొదలు భాగంలో మచ్చలు ఏర్పడి కుళ్లిపోతాయి. దీంతో లేత మొకలు నేలపై వాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం కిలో విత్తనానికి 1గ్రా. కార్బెండజిమ్తో విత్తన శుద్ధిచేయాలి. లేదా లీటర్ నీటిలో 1గ్రా. కార్బెండజిమ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ను కలిపి నేలను తడపాలి. అయితే వారం రోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు నేలను తడుపుకోవాలి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో మెంతిలో సరోస్పోరా ఆకు మచ్చ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటర్ నీటిలో 1గ్రా. కార్బెండజిమ్ కలిపి, వారం రోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదా కిలో విత్తనానికి 1గ్రా. కార్బెండజిమ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి.
తోటకూర
తోటకూరను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది తుప్పు తెగులు. ఈ తెగులు ఆశించిన ఆకుల అడుగు భాగాన తెల్లని బుడిపెల్లా కనిపిస్తాయి. ఆకుల పైభాగంలో పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణ కోసం లీటర్ నీటిలో 2.5 గ్రా. మాంకోజెబ్ కలిపి, వారం రోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు.. పైరు బాగా తడిసేలా పిచికారీ చేయాలి. ఈ సమయంలో ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనితోపాటు లీటర్ నీటిలో 2 మి.లీ. మలాథియాన్ కలిపి పిచికారీ చేస్తే.. ఆకు ముడత, ఆకులను కొరికి తినే గొంగళిపురుగులనూ నివారించవచ్చు.
కొత్తిమీర
కొత్తిమీరను దాదాపు అన్ని కూరల్లోనూ వినియోగిస్తారు. అంతేకాకుండా.. పచ్చి ఆకులనే సలాడ్ రూపంలోనూ తీసుకుంటారు. కాబట్టి, కొత్తిమీర పంటలో పురుగుల మందులను వాడకపోవడమే మంచిది. కానీ, విత్తనపు పంటగా వదిలినప్పుడు మందులను కొంతవరకూ వాడవచ్చు. కొత్తిమీరను ఆశించే బూడిద తెగులను నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. చొప్పున నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి పిచికారీ చేయాలి. చేనులో మురుగునీటి సదుపాయం లేనప్పు మాగు తెగులు ఉధృతి ఎకువగా ఉంటుంది. దీంతో విత్తనాలు కుళ్లిపోయి.. మొక్క శాతం తగ్గిపోతుంది. గింజలు మొలకెత్తిన తర్వాత కూడా నారు మొకల మొదళ్లు మెత్తబడిపోయి.. మొకలు ఎండిపోతాయి. దీని నివారణ కోసం నారుమళ్లను ఎత్తుగా ఉండేలా తయారు చేసుకోవాలి. చేనులో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనం మొలిచిన తర్వాత లీటర్ నీటిలో 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి నారుమడిని వారం రోజుల వ్యవధితో రెండుమూడు సార్లు బాగా తడపాలి.
పాలకూర : పాలకూరను ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. ఆకులపై మచ్చలు ఏర్పడటం వల్ల మారెట్లో సరైన రేటు రాదు. దీంతోపాటు పేనుబంక, ఆకులను తినే గొంగళి పురుగులు కూడా ఆశిస్తాయి.
గోంగూర : గోంగూరలోనూ ఆకుమచ్చ తెగులుతోపాటు రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు ఆశిస్తాయి.
బచ్చలి కూర : ఈ పంటలో కాండం కుళ్లు తెగులు, ఆకు మచ్చ తెగులు ఆశించి నష్టపరుస్తాయి.
కరివేపాకు : కరివేపాకులో ఆకుమచ్చ తెగులు, గొంగళి పురుగులు, సిల్లిడ్ నల్లి, పిండి పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. పిండి పురుగు ఆశించిన కొమ్మలను తీసివేస్తే.. వాటి బెడద కొంత వరకూ తగ్గుతుంది.
పుదీనా : పుదీనాలో కాండం కుళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఆకులను తినే పురుగుల ఉధృతి ఎక్కువ.
పైన తెలిపిన అన్ని రకాల ఆకుకూరల సస్యరక్షణకు.. లీటర్ నీటిలో 2 – 5 గ్రా. చొప్పున మాంకోజెబ్ లేదా 1గ్రా. చొప్పున కార్బెండజిమ్ మందులను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వైరస్ను వ్యాప్తిచేసే రసం పీల్చే పురుగులను నివారించడానికి.. లీటర్ నీటిలో 2 మి.లీ. చొప్పున డైమిథోయేట్ లేదా క్వినాల్ఫాస్ లేదా ఫిప్రొనిల్ మందులను పిచికారీ చేయాలి. కరివేపాకుపై మాత్రం గంధకం ఉన్న మందులను వాడవద్దు. ఆయా ఆకుకూరల్లో కాండం కుళ్లు తెగులు ఆశించినప్పుడు లీటర్ నీటిలో 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి నేలను బాగా తడపాలి.
…? మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి