గతంలో వ్యవసాయమంటే..‘ఒకే పొలం – ఒకే పంట’ అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. కానీ, కాలంతో పాటే సాగులోనూ గణనీయమైన మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు పండించే ఆధునిక పద్ధతి తెరపైకి వచ్చింది. కేవలం ఐదెకరాల క్షేత్రంతోనే అద్భుత ఆదాయాన్ని పొందేలా, ఉద్యానశాఖ ఒక నివేదికను రూపొందించింది. దీనిపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నది.
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఒకటి లేదా రెండు రకాల పంటలు మాత్రమే సాగు చేస్తుంటారు. కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడులు రాక, తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పంటలు సాగు చేసే విధానంపై ఉద్యానశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రయోగాలు, పరిశోధనలు చేసి, ఒక నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా ఐదు ఎకరాల భూమిని ఒక యూనిట్గా తీసుకొన్నారు. దీంట్లో ఐదు రకాల వ్యవసాయ అనుబంధ పనులతో వచ్చే ఆదాయాన్ని లెక్కించారు. దీనిని బట్టి రైతుకు ఏటా మొత్తంగా రూ.19.54 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో 30 శాతం పంట పెట్టుబడి ఖర్చులు తీసేయగా, సంవత్సరానికి నికరంగా రూ.13.67 లక్షల ఆదాయం మిగులుతుందని తేల్చారు. అంటే, ప్రతినెలా రూ. 1.14 లక్షలు రైతుకు అందనున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు పొలం గట్లపై టేకు, శాండల్వుడ్ చెట్ల పెంపకంతో అదనపు ఆదాయం పొందే అవకాశమున్నదని అంటున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పంటల రకాలు, సాగు చేయాల్సిన విస్తీర్ణం. ఎంత ఆదాయం వస్తుందో వివరించారు.
ఐదు రకాల పంటల ద్వారా మొత్తం రూ. 19.54 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఇందులోంచి 30 శాతం ఖర్చులు తీసేయగా, రైతుకు ఏటా రూ. 13.67 లక్షల నికర ఆదాయం మిగులుతుంది. అంటే, నెలకు రూ.1.14 లక్షలు.
–కొమ్మిడి స్వామిరెడ్డి