వారంతా గిరిజన మహిళలు. స్వశక్తిని నమ్ముకున్నారు. సొంతకాళ్ల మీద నిలబడాలని అనుకున్నారు. చిరుధాన్యాలను నమ్ముకుని ముందడుగు వేశారు. ఘనమైన ఫలితాలు సాధించి సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలెగూడ (కొలాం గొంది) గ్రామం దగ్గర ఉంటుంది శ్రీ ఆంజనేయ డ్రైమిక్స్ ఇండ్రస్ట్రీస్. చుట్టుపక్కల గ్రామాలకు పదిమంది గిరిజన మహిళలు సంఘంగా ఏర్పడి దీనిని నెలకొల్పారు. ఐటీడీఏ ద్వారా రాయితీ కింద అందించిన రూ.24 లక్షలకుతోడు మహిళా సంఘం ద్వారా రూ.12 లక్షలకు వారు పొదుపు చేసుకున్న రూ.4 లక్షలు జతచేసి ఈ యూనిట్ను స్థాపించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా రాజమండ్రి నుంచి ప్రతి నెలా రూ.7 లక్షల విలువైన చిరుధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని ప్రాసెసింగ్ చేసి మూడు రకాల ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా రూ.12 లక్షల వరకు వ్యాపారం చేస్తున్నారు. ముడిసరుకు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ కలిపి నెలకు రూ.10 లక్షలు ఖర్చు అవుతున్నది. అన్ని ఖర్చులు పోనూ రూ.2 లక్షల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు వీళ్లు.
మూడు రకాల ఉత్పత్తులు
శ్రీ ఆంజనేయ డ్రైమిక్స్ ఇండ్రస్ట్రీస్లో జొన్నలు, మినుములు, వేరుశనగ, జీర, రెడ్చిల్లీ, ఆవాలు, కొర్రలు, పెసర, మిరియాలు, ధనియాలు, సజ్జలు, బాదం, బొంబాయి రవ్వ, యాలకులు, పసుపు ఇలా 20 ధాన్యాలు, మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో మూడు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. స్వీట్ మిల్, జవార్ మిల్, మల్టీగ్రేన్ ఈ మూడు ఉత్పత్తులను ‘గిరి’ బ్రాండ్ పేరిట ప్యాకింగ్ చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు, కిశోర బాలికల ఆరోగ్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ పరిశ్రమ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన సంతులిత ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. చదువు లేకున్నా ఏటా సుమారు రూ.20 లక్షల దాకా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
…?జాడి హనుమయ్య