ఆరుగాలం శ్రమించి అందరికీ పట్టెడన్నం పెడుతున్న రైతన్నలు పంటల సాగులో కీటకాలు, తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాల నుంచి అన్నదాతలకు విముక్తి కల్పించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్ర కుమార్ నడుం బిగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరు.. మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్ల తామర పురుగు తెగులు నివారణకు సంయుక్తంగా పరిశోధన సాగించారు. ఆ పురుగును ప్రాథమికంగా నిరోధించగలిగారు. అంతేకాదు తమ పరిశోధన వివరాలను న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)కు సమర్పించారు. వీటిని పరిశీలించిన బీఐఆర్ఏసీ.. మరిన్ని పరిశోధనల నిమిత్తం వారికి రూ.50 లక్షల గ్రాంటును మంజూరు చేసింది.
వ్యవసాయ కుటుంబంలో పుట్టి..
నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన గాజుల ప్రభాకర్ది వ్యవసాయ కుటుంబం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే యూజీసీ- బీఎస్ఆర్-ఆర్ఎఫ్ఎంఎస్ ఫెలోషిప్కు ఎంపికయ్యాడు. తన పరిశోధనలపై 20 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో వ్యాసాలు రాయడంతోపాటు 3 పుస్తకాలను ప్రచురించాడు. 4 పేటెంట్లు సంపాదించాడు. దక్షిణ భారత దేశంలో పెరిగే ఓ కొత్త మొక్కపై తొలిసారి నివేదిక రూపొందించాడు. ఆస్టరేసీ కుటుంబానికి చెందిన ‘జిమ్నాంతిమం అమిగ్డాలినం’ అనే ఈ మొక్క ఆకులను మధుమేహం నియంత్రణకు ఉపయోగిస్తారు. ఓ వైపు పరిశోధనలు సాగిస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన డాక్టర్ ప్రభాకర్ అధ్యాపకుడిగా మూడేండ్లపాటు కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో, ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేశాడు. ప్రస్తుతం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (ఏఐసీ-సీసీఎంబీ)లోని బీఐఆర్ఏసీ-ఎస్పీఏఆర్ఎస్హెచ్ ఫెలోషిప్లో పరిశోధన కొనసాగిస్తున్నాడు.
జేఎన్టీయూలో టాపర్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన డాక్టర్ పాపతోటి నరేంద్ర కుమార్ ఎమ్మెస్సీ మైక్రోబయాలజీలో జేఎన్టీయూ టాపర్గా నిలిచాడు. ఎమ్మెస్సీలో ఉన్నప్పుడే ఏపీసీవోఎస్టీ (ప్రస్తుతం టీఎస్సీఓఎస్టీ) నుంచి రూ.5 లక్షల గ్రాంట్ను అందుకున్నాడు. ఉస్మానియా వర్సిటీ నుంచి మైక్రోబయాలజీలో పీహెచ్డీ పూర్తిచేసిన నరేంద్ర కుమార్ గతంలో సౌభాగ్య బయోటెక్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి మేనేజర్గా సేవలందించాడు. కోడి ఈకలతో ఎరువును తయారుచేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి రూ.32 లక్షల స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్ రీసెర్చ్ గ్రాంట్ను పొందాడు. ఆయన పరిశోధనలకు గుర్తింపుగా థాయిలాండ్ సురనరీ యూనివర్సిటీ సూల్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ లభించింది. పలు దేశాల జర్నల్స్లో ప్రచురితమైన ఆయన పరిశోధనలకు అనేక అవార్డులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే రైతులకు ఉపయోగపడే మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపాడు.
…?బండారు రాజు