రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలిక లాభాలతో ఆయిల్ పామ్ పంట.. ఆధునిక కల్పతరువుగా మన్ననలు పొందుతున్నది.అన్ని కాలాలకూ అనుకూలమైన ఈ పంట.. తకువ పెట్టుబడితోనే 30 ఏళ్ల వరకూ స్థిరమైన ఆదాయం అందిస్తున్నది.దీంతో ఆయిల్ పామ్ సాగుకు రైతుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో.. ఆయిల్ పామ్ పంటకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. నర్మెట వద్ద ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభమైతే.. సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉన్నది.
సారవంతమైన భూములు ఉండటం, ‘కాళేశ్వరం’ ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుండటంతో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భూమి పూజ చేయగా, ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. స్థానికంగా పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు.
జోరుగా సాగు
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 25 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొక్కలు నాటే దగ్గరి నుంచి దిగుబడిని మార్కెట్కు తీసుకెళ్లే వరకూ రైతులకు తోడుగా ఉండేలా, ప్రతి క్లస్టర్కు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రస్తుతం 10 వేల ఎకరాలను గుర్తించి, ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే 5వేలకు పైగా ఎకరాలలో రైతులు ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరుగుతుండగా, వీటిని చూసిన ఇతర రైతులు కూడా సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా అందరికీ సరిపడా మొక్కలు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
రంగనాయక సాగర్ రిజర్వాయర్, ములుగు దగ్గర ఆయిల్ పామ్ నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. రైతు పట్టాదారు పుస్తకానికి అనుగుణంగానే మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఒక ఎకరానికి సరాసరిగా 55 నుంచి 60 మొక్కల దాకా నాటుతున్నారు. ఈ తోటలు ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా తట్టుకుంటాయి. మార్కెటింగ్ చెల్లింపులు తదితర వాటి పరంగా రైతులకు ఇది అత్యుత్తమ సురక్షితమైన పంటగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కోతులు, అడవి పందుల వంటి జంతువుల నుంచి ఈ తోటలకు ఎలాంటి హాని ఉండదనీ, తెగుళ్లు, వ్యాధులు సోకే అవకాశం కూడా ఉండదని అంటున్నారు.
ఎంతో ప్రత్యేకం
ఇతర పంటల కంటే ఆయిల్ పామ్ సాగు ఎంతో ప్రత్యేకం. ఇది అన్ని కాలాలకూ అనుకూలమైన పంట. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకూ స్థిరమైన ఆదాయం పొందవచ్చు. తకువ పెట్టుబడితోనే ఎకువ లాభాలు ఆర్జించవచ్చు. ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి ద్వారా, నికరంగా రూ.లక్ష దాకా సంపాదించవచ్చు. అయితే, పంట వేసిన నాలుగేండ్ల తర్వాతే దిగుబడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడేండ్లపాటు అంతర పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సాగుకు ముందుకు వచ్చిన ప్రతి రైతుకూ 90 శాతం రాయితీపై ప్రభుత్వమే మొక్కలు, డ్రిప్ పరికరాలతోపాటు ఎరువులను అందిస్తున్నది. రైతుల కోసం నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేస్తున్నది. దీంతో రైతుకు పెట్టుబడి బరువు తగ్గుతున్నది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండటం లేదు. సాంకేతిక పరిజ్ఞానమూ అధికారులే అందిస్తారు.
అనేక లాభాలు
బహుళ వార్షిక పంటలన్నిటిలో పామాయిల్ ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల చొప్పున 30 ఏండ్ల వరకూ రైతుకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇటు రైతుకు, అటు పర్యావరణానికి మేలు కలిగించేదిగా ఆయిల్ పామ్ పేరు గాంచింది. ఈ పంటలకు చీడ పురుగులు, కోతులు, రాళ్ల వాన బెడద తక్కువ. దిగుబడులను పామాయిల్ కంపెనీలే వచ్చి కొనుగోలు చేస్తాయి. దీనివల్ల రైతు ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. పామాయిల్ను ఎక్కువగా బేకరీ ఉత్పత్తుల తయారీకి, గృహ అవసరాలకు వినియోగిస్తుంటారు.
దీని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులు కూడా బయో డీజిల్, ముల్చింగ్కు ఉపయోగపడుతాయి. దీంతోపాటు పామాయిల్ సాగు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఒక ఎకరంలో వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగెకరాల్లో పామాయిల్ పంట పండించవచ్చు. పంట వేసిన నాలుగో ఏడాది నుంచి ఎకరానికి 10-12 టన్నుల దిగుబడితో, సుమారు రూ.80 వేల నుంచి లక్ష వరకూ ఆదాయం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ముందుగానే ఒప్పందం చేసుకున్న కంపెనీలే మొక్కలతోపాటు నాలుగేండ్ల వరకూ ఎరువులను సరఫరా చేస్తాయి. దిగుబడి సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం.. కంపెనీలే గెలలు కొనుగోలు చేస్తాయి.
అంతర పంటలతోనూ
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేస్తూ, అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉన్నది. మొదటి మూడేండ్ల వరకూ ఆయిల్ పామ్లో అంతర పంటలుగా మక్కజొన్న, వేరుశనగ, మిర్చి, సోయా చిక్కుడు, పెసర, మినుములు, బొప్పాయి, పుచ్చ తదితర పంటలు సాగు చేసుకోవచ్చు. వీటి ద్వారా ఎకరానికి రూ. 30 వేలకు పైగా ఆదాయం పొందవచ్చు. ఐదేండ్ల తర్వాత ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలుగా నీడలో పెరిగే కోకో, అల్లం, అనాస, ఔషధ మొక్కలు, పశుగ్రాసం వేసుకొని.. అదనంగా ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకూ లాభాలు అందుకోవచ్చు.
ఆయిల్ పామ్ ఆకులు, ఎండిన మగ గెలలు, మట్టలు లాంటి వ్యవసాయ వ్యర్థాలనే సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం, పెట్టుబడి ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. కంచె వెంబడి వెదురు/మలబార్ వేప పంట వేసుకుంటే.. నాలుగో ఏడాది నుంచి ఎకరానికి రూ.40 వేల వరకూ సుమారు 30 ఏండ్లదాకా ఆదాయం పొందవచ్చు. అదే కంచె వెంబడి రెండో వరుసల్లో శ్రీగంధం మొక్కలు నాటుకుంటే.. 15 ఏండ్ల తర్వాత ఎకరానికి సుమారు కోటి రూపాయలకు పైగా అదనపు ఆదాయం పొందవచ్చు.
ఆయిల్ పామ్కు మహర్దశ
వంట నూనె పరిశ్రమలో అమెరికా, చైనా, బ్రెజిల్ తరువాత భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. అందులో పామాయిల్ ఒకటి. మన దేశ జనాభాకు 22 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, ఇక్కడ 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మిగితాది దిగుమతి అవుతున్నది. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ 60 శాతం. అంటే.. 9-10 మిలియన్ టన్నుల పామాయిల్ నూనెను సుమారు రూ.58,800 కోట్లు వెచ్చించి భారత్ దిగుమతి చేసుకుంటున్నది. అదనంగా 70 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగు చేయడం ద్వారా ఈ దిగుమతులను అధిగమించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పామాయిల్ దిగుమతులను పూర్తిగా తగ్గించుకొని, భారత్ వెచ్చిస్తున్న రూ.58,800 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే, ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వ సహకారం
రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 59 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన లాభసాటి వ్యవసాయ సాగు విధానంలో భాగంగా, రాష్ట్రంలో ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గతేడాది రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా గుర్తిస్తూ.. 7.64 లక్షల ఎకరాల్లో సాగు చేయడానికి అనుమతులు జారీ చేసింది. బడ్జెట్లోనూ భారీగా నిధులను కేటాయించి, రైతులను ప్రోత్సహిస్తున్నది.
సార్ ప్రోత్సాహంతోనే..
గతేడాది ఐదెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు పెట్టిన. మొక్కలన్నీ మంచిగా ఎదుగుతున్నయ్. అంతర పంటలుగా గతేడాది మక్కజొన్న, పత్తి సాగు చేశా. మక్కజొన్న 220 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మక్కజొన్న సాగు చేస్తా. రెండెకరాల్లో పత్తి వేశా. అది కూడా బాగానే ఉంది. మంత్రి హరీశ్రావు సార్ ప్రోత్సాహంతోనే ఆయిల్ పామ్ సాగు చేస్తున్నా. మొన్నీమధ్యే సార్ స్వయంగా వచ్చి నా పంటను చూసి వెళ్లారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా ఇక్కడ చూసి.. సాగు చేస్తున్నారు.
-తిప్పని నాగేంద్రం, రైతు
…? కత్తుల శ్రీనివాస్ రెడ్డి