తీగజాతి కూరగాయల్లో కాకర ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలు ఉండే కాకరకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ, కాకర సాగు చేసే రైతులకు మాత్రం విత్తనాల కొరత శాపంగా మారుతున్నది. అయితే, క్షేత్రస్థాయిలో విత్తనోత్పత్తి చేసుకొని ఈ సమస్యను అధిగమించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
కాకరలో ఏడాది పొడవునా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాసంగి లేదా ఎండాకాలంలో విత్తనోత్పత్తి చేపట్టాలి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో అయితే కచ్చితంగా ఎండాకాలంలోనే విత్తనోత్పత్తి చేయాలి. నీటివసతి కింద సెప్టెంబర్ చివరివారం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.
రకాలు
కాకరలో హైబ్రిడ్, సూటి(దేశీయ) రకాలు స్థానికంగా సాగవుతున్నాయి. అయితే రైతులు మాత్రం కేవలం సూటి రకాల్లో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. హైబ్రిడ్ రకాల్లో ఆడ, మగ ఉంటాయి. కాబట్టి వాటిలో రైతులకు విత్తనోత్పత్తి సాధ్యం కాదు. ప్రియ, ప్రీతి, ప్రియాంక, అర్క, హరిత, జగిత్యాల రకాలలో రైతులు విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. విత్తనోత్పత్తిలో సూర్యరశ్మి అందుబాటులో ఉండటం అత్యంత కీలకం. రబీ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే నీటి సౌకర్యం ఉంటే.. రైతులు విత్తన పంటను నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు.
అనుకూలమైన నేలలు
విత్తన పంటను సాగు చేయాలనుకొనే నేలలో సొంతంగా విత్తుకున్న మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. మురుగునీరు పోయే నేలలు, సారవంతమైన నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి.
విత్తన ఎంపిక
కచ్చితంగా నమ్మకమైన సంస్థ లేదా నాణ్యమైన వనరుల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలి. నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండి చీడపీడలు లేని విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. పగిలిన, రంగు కోల్పోయిన విత్తనాలను తీసివేయాలి. విత్తన పంట కోసం ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నాటడానికి ముందు విత్తనాలను అరగంట పాటు వెచ్చని నీటిలో ఉంచాలి. దీంతో విత్తనం చివరి గట్టిపొర మెత్తబడుతుంది. తడి ఉన్న గోనెసంచి లేదా తేమతో కూడిన గుడ్డ సంచుల్లో 3-4 రోజులు ఉంచినా కూడా గింజలు మెత్తబడి, మొలకలు త్వరగా వస్తాయి. కిలో విత్తనానికి 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడి జీవశిలీంధ్ర నాశనితో విత్తనశుద్ధి చేయాలి. దీనివల్ల శిలీంద్రాల తాకిడి తగ్గుతుంది.
పొలాన్ని సిద్ధం చేయడం
ప్రధాన పొలాన్ని 3-4 సార్లు మెత్తగా దున్నాలి. రెండు మీటర్ల మధ్య దూరంతో 60 సెం.మీ వ్యాసార్థంతో కాలువలు చేయాలి. కాలువల సాలులో ఒక అడుగు లోతు, 30 సెం.మీ వ్యాసార్థంతో గుంతలు తీయాలి. ఈ గుంతల్లో 2 సెం.మీ లోతులో విత్తనాలను నిలువుగా విత్తుకోవాలి. మొదట ఒక గుంతకు రెండు విత్తనాలు నాటి, మొలకలు వచ్చిన తర్వాత పలుచన చేయాలి. విత్తే ముందు గుంతలను తడపాలి.
పోషకాల నిర్వహణ
ఎకరానికి బాగా చివికిన 10 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కిలో వేయాలి. ప్రతి గుంతలో ఒక కిలో పశువుల ఎరువుకు 100 గ్రా. వేపచెక్కతో కలిపి ప్రాథమికంగా వేసుకోవాలి. ఒక నెల తర్వాత గుంతకు 500 గ్రా. చొప్పున వానపాముల ఎరువును పైపాటుగా.. మొక్క మొదళ్లలో వేయాలి. సకాలంలో కలుపు తీసివేయాలి. నాటిన తర్వాత వారం వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. పూత సమయం, కాయలు ఏర్పడే దశల్లో నీటిఎద్దడి లేకుండా చూసుకోవాలి.
కల్తీల ఏరివేత
కాకర స్వతహాగా స్వపరాగం చెందే మొక్క. అయితే, కొంత మేరకు పరపరాగ సంపర్కం కూడా జరుగుతుంది. శాఖీయ దశ, పూత దశ, కాయలు ఏర్పడే దశల్లో లక్షణాల ఆధారంగా కల్తీలను గుర్తించి ఏరివేయాలి. 0.2% కంటే ఎక్కువగా కల్తీలు లేకుండా చూడాలి. ఇందుకోసం మూడు దఫాలుగా క్షేత్ర తనిఖీలు చేపట్టాలి.
విత్తన సేకరణ
కాయలు ఆకుపచ్చరంగు నుంచి పసుపుపచ్చ లేదా నారింజ రంగులోకి మారిన దశలో తెంపి, నీడలో ఆరబెట్టాలి. అవి పగిలిన తర్వాత ప్రకాశవంతమైన విత్తనాలు కనిపిస్తాయి. లేదా తోడుకలు తీసిన తర్వాత రక్తపు రంగుతో కూడిన గింజలను ఒకరోజంతా నీళ్లలో మురుగబెట్టాలి. ఆ తర్వాత బాగా కడిగి, ఎండబెట్టి నిల్వచేయాలి. విత్తనంలో తేమ ఏడు శాతానికి మించకుండా చూసుకోవాలి. చల్లని, పొడి పరిస్థితుల్లో నిల్వచేస్తే ఐదేళ్ల వరకూ కాకర గింజలు నాణ్యత కోల్పోకుండా ఉంటాయి.
నాణ్యతా ప్రమాణాలు
కనీస మొలక 60 శాతం, జన్యు స్వచ్ఛత 98 శాతం, గరిష్ఠ తేమ 74 శాతం, గరిష్ఠ జడ పదార్థం 2 శాతం ఉండాలి. ఒకసారి ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులు పై నాణ్యతా ప్రమాణాలు ఉంటే.. నాలుగైదేళ్ల వరకూ సాగు చేసుకోవడానికి వాడుకోవచ్చు. మేలైన దిగుబడులు పొందవచ్చు. అయితే సూటి రకాలలో మాత్రమే విత్తనోత్పత్తి చేసుకోవాలి.
…? మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి