‘ఒక్క ఓటు.. చరిత్ర గతిని మారుస్తోంది.. మన భవితను తిరగరాస్తోంది.. మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తోంది.. అందరం ఓటరుగా నమోదవుదాం..‘ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు హక్కు నమోదు, వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మండల కేంద్రాల్లో కార్యక్రమాలు పూర్తవగా.. ఈనెల 20 నుంచి గ్రామస్థాయిలో అవగాహన కల్పించనున్నాయి. మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోపాటు వీవీప్యాట్స్, సంచార వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 13 మొబైల్ వాహనాలను ఉపయోగించి ఓటు ఏ విధంగా వేయవచ్చో తెలుపుతున్నాయి. ప్రధానంగా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి.. ఓటింగ్ శాతం పెరగడానికి ఉపయోగపడుతాయని భావిస్తున్నాయి. అధికార యంత్రాంగానికితోడు మహిళా, యువజన సంఘాలు విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి.
నిర్మల్ టౌన్, ఆగస్టు 6 : ఓటు వజ్రాయుధం లాంటిది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా సమగ్ర ఓటర్ల జాబితాకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించే పక్రియను వేగంగా చేపడుతూనే వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రెవెన్యూశాఖ విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో 396 గ్రామ పంచాయతీలతోపాటు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 918 పోలింగ్ బూత్ల్లో ఓటింగ్శాతం పెంచాలన్న లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోపాటు వీవీప్యాట్స్, సంచార వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. 13 మొబైల్ వాహనాలను ఉపయోగించి ఓటు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుపుతున్నారు. కొత్త ఓటు హక్కు వచ్చిన వారికి బీఎల్వో కేంద్రాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్స్లో ఓటరు నమోదు ఏ విధంగా చేసుకోవచ్చో అవగాహన కల్పించడం వల్ల ఓటర్లలో చైతన్యం రానుంది. ప్రతి మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించగా.. ఈనెల 20 నుంచి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. మాక్ ఓటింగ్ ద్వారా అపోహలు తొలగిపోనున్నాయి.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా బీఎల్వో కేంద్రాల్లో ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 918 పోలింగ్ కేంద్రాలుండగా, నిర్మల్లో 302, ముథోల్లో 311, ఖానాపూర్లో 305 పోలింగ్ కేంద్రాలున్నాయి. జిల్లాలో 6,71,369 మంది ఓటర్లుండగా, 3,24,990 పురుషులు, 3,44,325 మహిళా ఓటర్లు, 54 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరందరికీ బీఎల్వోలు, మొబైల్ వాహన నిర్వాహకులు ఈవీఎం ద్వారా ఓటు ఎలా నమోదు చేసుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుండగా, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో అది 10 శాతం తగ్గిపోతున్నది. దీనిని నివారించడానికి, ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా, యువజన సంఘాలు, విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈవీఎం, వీవీ ప్యాట్స్ ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కల్పిస్తూనే కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా పోలింగ్ బూత్ల్లో ప్రచారం చేస్తున్నాం. కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడం వల్ల ఓటు ప్రాధాన్యత తెలుస్తోంది.
– రత్నా కల్యాణి, ఆర్డ్డీవో, నిర్మల్
నేను మొన్ననే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నా. జాబితాలో పేరు వచ్చింది. ఓటు ఎలా వేయాలో నాకు గుర్తు లేకుండే. ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వచ్చి ఓటింగ్ యంత్రాల్లో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. నేను చదువుకున్నవాన్ని కావడంతో పూర్తిగా అవగాహన వచ్చింది. తప్పకుండా ఓటు చెల్లుబాటు అయ్యేలా ఓటు వినియోగించుకుంటా.
– గంగాధర్, కొత్త ఓటరు
నేను 20 ఏళ్ల నుంచి ఓటు వేస్తున్నా. గతంలో చిట్టి ఇస్తేదానిపై గుర్తు చూసి ఓటు వేసేవాళ్లం. ఇప్పుడు కొత్తగా మిషిన్లు వచ్చాయి. మిషిన్లో పార్టీ గుర్తులు ఉంటాయి. గుర్తు మీద చూసి వేలితో వేస్తే మనం కోరుకున్న వ్యక్తికి ఓటు వేసినట్లు. గతంలో కొత్తగా మిషిన్లలో ఓటు వేసేటప్పుడు ఎట్లా వేయాలో అర్థం కాకపోయేది. కొన్ని ఓట్లు చెల్లకుండాపోయేవి. ఇప్పుడు ముందుగానే ప్రభుత్వం అవగాహన పెంచడం వల్ల ఓటు వేసే విధానం తెలిసిపోయింది. ఈసారి ఎవ్వరిని అడగాల్సిన పని ఉండదు. నేనే డైరెక్ట్గా పోయి ఓటు వేస్త.
– అడెపు భూమవ్వ, వెంగ్వాపేట్