ఆసిఫాబాద్ టౌన్:మహాత్ముడి సత్యం, అహింసా మార్గాలు భారతీయులందరికి అనుసరణీయమని ఆసిఫాబాద్ కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి , ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వైవిఎస్ సుధీంద్ర, జిల్లా సబ్ జైల్లో మూడవ అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు, జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో డీఐఈవో శ్రీధర్ సుమన్లు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన సత్యం,అహింసా, నిబద్ధతలు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించి ప్రజలు జీవనం సాగించడమే మహాత్మునికి ఇచ్చిన ఘన నివాళి అని అన్నారు.
పోలీసు సిబ్బంది మద్యపాన నిషేదం పాటిస్తూ మద్యపానానికి దూరంగా ఉండాలన్నారు. ప్రజలు శాంతి మార్గంలో న్యాయపరమైన హక్కుల కోసం చేసే నిరసన కార్యక్రమాల్లో దురుసుగా ప్రవర్తించరాదని సూచించారు. అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ క్షణికావేశంలో తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలుకు వచ్చినంత మాత్రాన జీవితం పూర్తిగా అయిపోయిందనుకోవద్దని, గాంధీజీ చెప్పిన సన్మార్గంలో జీవనం సాగించాలన్నారు. అనంతరం ఖైదీలకు పండ్లను పంపిణీ చేశారు.