ప్రభుత్వ దవాఖానల్లో మురుగు నీటిని శుద్ధి చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయగా సత్ఫలితాల నిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 20 దవాఖానల్లో రూ.134.46 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని రిమ్స్, మంచి ర్యాల ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేయనున్నారు. ఫలితంగా దవాఖాన నుంచి వెలువడిన నీరు బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇంకా.. శుద్ధి చేసిన మురుగు నీటిని చెట్లకు వినియోగించే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు వై ద్యానికి కోట్లు ఖర్చు చేస్తున్నది. కార్పొరేట్ స్థాయి వసతులు, వైద్యం అందిస్తుండడం తో రోగులు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా వంటి వ్యాధులతో గ్రామాలు మంచం పట్టేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్లు, గదులు శుభ్రం చేసినప్పుడు మురుగునీరు బయటకు వస్తున్నది. దవాఖానల్లో వినియోగించిన నీరు మురుగు కాలువల ద్వారా సమీప ప్రాంతాలకు చేరుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 20 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో రూ.134.46 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించనుంది. ఒక్కో ప్లాంటునకు రూ.6 కోట్లకుపైగా కానుంది.
రిమ్స్, మంచిర్యాలలో ఎస్టీపీలు ఏర్పాటు
ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల జిల్లా దవాఖానల్లో ప్రభుత్వం మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మించనుంది. ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఇప్పటికే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాం టు అందుబాటులో ఉంది. ఇందులో రోజు 5 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. వీటిని ఉమ్మడి జిల్లాలోని రెండు దవాఖానల్లో పచ్చదనం, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. రిమ్స్, మంచిర్యాల దవాఖాన ల్లో ప్రభుత్వం ఎస్టీపీలను ఏర్పాటు చేస్తుండడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. దవాఖాన నుంచి వెలువడిన నీరు బయటకు వచ్చే అవకాశాలుండవు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దవాఖానల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.