కడెం, సెప్టెంబర్ 23: వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గురువారం కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించిన మండలి సభ్యులు.. శుక్రవారం అన్నదానం చేపట్టారు. అదే రోజు రాత్రి నిమజ్జన ఉత్సవాలను నిర్వహించగా, శనివారం గ్రామ సమీపంలోని చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. వినాయకుడి నిమజ్జన ఉత్సవాల్లో స్థానిక యువకులు డప్పుచప్పుళ్లు, డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఖానాపూర్ పట్టణంలో..
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 23 : తన నివాసంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, కార్యకర్తలు భక్తి శ్రద్ధలతో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్ ప్రధాన రహదారి వెంబడి మేళాతాళాలు, నృత్యాలతో ఊరేగించారు. స్థానిక గోదావరిలో ప్రశాంత వాతవరణంలో నిమజ్జనం చేశారు. కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శనిగారపు శ్రావణ్, ఆకుల వెంకాగౌడ్, బలగం రమేశ్, సాబీర్ పాషా, సాడిగే ప్రసాద్, కొడిమ్యాల వీరేశ్, ఎర్రన్న, సల్ల వంశీ, షేక్ షఫీ, బీఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వెళ్లి రా వినాయకా..
దస్తురాబాద్, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గణనాథుల నిమజ్జనం వైభవంగా సాగింది. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లోని పలు వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గణపతి బొప్ప మోరియా నినాదాలు మార్మోగాయి. బ్యాండ్ మేళాలు వాయిస్తూ యువతీ యువకులు, చిన్నారులు, నిర్వాహకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామ శివారులో ఉన్న గోదావరి, చెరువుల్లో గణేశ్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.