గుడిహత్నూర్, జూలై 30 : గుడిహత్నూర్ మండలంలో కూరగాయలు అధికంగా పండిస్తారు. ఈ మండలం టమాటా సాగులో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. అయితే కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసి చేను లేదా ఇంటి వద్ద ఖాళీ స్థలంలో నారు తయారు చేసుకునే వారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సక్రమంగా మొలకెత్తక పోవడంతో డబ్బులు, సమయం వృథా అయ్యేది. ఈ క్రమంలో కూరగాయల నారును ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునే వారు. ఇదే నారును స్థానికంగా తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కొందరు నర్సరీలను ప్రారంభించారు. వీటిలో మిరప, టమాటా, క్యాబేజీ, కాలీ ఫ్లవర్, వంకాయ తదితర నారును అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా మండలంలో 14 నర్సరీలు ఏర్పాటయ్యాయి.
నర్సరీ తయారీ
అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలాన్ని లీజు కు తీసుకొని రాతి స్తంభాలు, ఇనుప రాడ్లతో షెడ్ నెట్లను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. కొబ్బరి బూరుతో తయారైన ఎరువుతో(టెంకాయ) ప్రత్యేకమైన ట్రేలలో నారును తయారు చేస్తున్నారు. ఒక నర్సరీలో మిరప, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ నారును అందుబాటులో ఉంచుతున్నా రు. దాదాపు ఒక్కో నర్సరీలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మొక్కలను పెంచుతున్నారు. డిమాండ్ బట్టి టమాటా ఒక మొక్క 80 పైసల నుంచి ఒక రూపాయి, మిర్చి రూ.1.50 నుంచి రూ.2లు, గోబి, వంకాయ ఒక రూపాయి, వివిధ రకాల బంతి పూల నారు రూ.3 నుంచి రూ.5 వరకు అమ్ముతున్నామని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.
స్థానికులకు ఉపాధి..
నర్సరీల ఏర్పాటుతో స్థానిక కూలీలకు ఉపాధి ల భిస్తోంది. ఒక నర్సరీలో దాదాపుగా 10 నుంచి 15 మంది పని చేస్తుంటారు. ఇలా రోజు మండల పరిధిలో ఉన్న నర్సరీల్లో దాదాపుగా 200 మందికి ఉపాధి దొరుకుతున్నది. కోరుకున్న రకం నారు లభించడంతో రైతులతోపాటు ప్రత్యేకంగా కూరగాయలు సాగు చేసే వారు తీసుకెళ్తున్నారు. ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్, బేల, జైనథ్, తాంసి మండల రైతులతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల వారు నారును తీసుకెళ్తున్నారు.
భారం తగ్గింది..
గతంలో నారు కోసం నానా తిప్పలు పడ్డాం. ఇప్పుడు వివిధ రకాల కూరగాయల నారు దగ్గరలోనే లభిస్తుండడంతో అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఏ రకం విత్తనాల నారు కావాలన్నా.. లభిస్తుండడంతో కూరగాయల సాగుపై దృష్టి పెట్టాం. మార్కెట్ సౌకర్యం కూడా ఉంది.
– వైజునాథ్ కేంద్రె, రైతు, గుడిహత్నూర్
నాలుగేండ్లుగా తయారు చేస్తున్నా..
నాలుగు సంవత్సరాల నుంచి నారు తయారు చేస్తున్నా. రైతులు ఏ రకం నారు అడుగుతున్నారో ఆ రకం నారు పెంచి అందుబాటులో ఉంచుతున్నా. దీంతో ప్రతి యేటా కూరగాయల నారుకు డిమాండ్ పెరుగుతుండడంతో నర్సరీలను పెంచుతున్నాం.
– మెస్రం శంభు, నర్సరీ నిర్వాహకుడు, గుడిహత్నూర్