ఉట్నూర్, ఏప్రిల్ 8 : భారతదేశానికి స్వాతం త్య్రం కోసం ఉద్యమాలు చేసిన వీరులు చాలామందే ఉన్నారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకునే పేరు రాంజీగోండ్. బ్రిటీష్ వారిని గడగడలాడించిన వీరుల్లో మొదటగా నిలిచేది ఈయనే. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆయనను దొంగదెబ్బ తీసి నిర్మల్ రాజుల కోటలోని ఓ చెట్టుకు వేయి మందితో కలిసి ఉరితీశారు. ఈ సంఘటన జలియన్వాలాబాగ్ కంటే తీవ్రమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి మహానాయకుడి చరి త్ర రానురానూ కనుమరుగువుతున్నదని ఏజెన్సీలోని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు (ఆదివారం) రాంజీగోండ్ 166వ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
దేశంలోని ఛత్తీస్గఢ్, చాందా, మాణిక్గఢ్, తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూర్, చెన్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గోండు రాజులు పాలించేవారు. ఈ ప్రాంతాన్ని జనగావ్గా పిలిచేవారు. పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాటి జనగావ్ (ఆసిఫాబాద్) కేంద్రాన్ని రాంజీగోండ్ పాలించేవారు. పక్కనున్న నిజాం సంస్థానానికి భద్రత దృష్ట్యా నిర్మల్, ఆదిలాబాద్ కీలకంగా ఉండేవి.
ఎందుకంటే మరాఠ్వాడకు, ఇటు సెంట్రల్ ప్రొవిన్సెస్ అయిన నాగ్పూర్కు వెళ్లేదారిలో ఈ రాజ్యా లు ఉన్నాయి. అందుకే నైజాం ప్రభు వీటిపై కన్నేశారు. కానీ గోండ్రాజులు స్వేచ్ఛజీవులు. ఆత్మ గౌరవం, స్వయం పాలనకోసం చంపడానికైనా సిద్ధపడేవారు. అందుకే నిజాం ప్రభువును తిప్పికొట్టాడు. నిరంకుశత్వాన్ని ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొన్నారు. జనగావ్కు పక్కనే ఉన్న మహారాష్ట్రలో బ్రిటీష్ పాలన ఉండేది. కొంతమంది బ్రిటీష్ సైనికులు అక్రమంగా గోండు రాజ్యంలో ప్రవేశించి వెట్టిచాకిరీ చేయించుకునేవారు. మాట వినని అడవి బిడ్డలను కిరాతకంగా చంపేసేవారు. గిరిపుత్రులపై తెల్లదొరల దౌర్జన్యం సహించని రాంజీగోండ్ ఎదురు తిరిగాడు. తన రాజ్యంలో బ్రిటీష్ వాళ్ల దొరతనం ఎంతమాత్రం సాగదని హెచ్చరించాడు. రాంజీగోండ్ ధిక్కారాన్ని బ్రిటీష్ వారు సహించలేదు. జనగావ్పై దాడిచేశారు. తెల్లోడిని ఎదుర్కోడానికి ప్రతి గిరిజనుడు యుద్ధవీరుడయ్యాడు. బరిసెలు, కత్తులు, రాళ్లే ఆయుధాలుగా గెరిల్లా యుద్ధతంత్రంతో పోరాడి బ్రిటీష్ సైన్యాన్ని పారదోలారు. రాంజీగోండ్ సాహసం బ్రిటీష్ వారిలో వణకు పుట్టించింది. రాంజీ దేశభక్తి, స్వాతంత్య్ర కాంక్ష తమ సామ్రాజ్యావాదానికి పెనుమార్పుగా భావించారు.
రాంజీగోండ్ అంతానికి బ్రిటీష్ చర్యలు..
రాంజీగోండ్ను కోవర్టుగా చంపే బాధ్యతను కల్నల్ రాబర్ట్కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించింది. నిజాం సైన్యాలతో కుమ్మక్కై బ్రిటీష్ ఆర్మీ రాంజీగోండ్ను చంపడమే లక్ష్యంగా వేట ప్రారంభించింది. 1857లో నిర్మల్ దగ్గరలో రాం జీగోండ్ ఉన్నాడని పక్కా సమాచారం తెలుసుకున్న కల్నల్ రాబర్ట్ భారీసైన్యంతో దాడిచేశాడు. తుపాకులతో యుద్ధం చేసిన తెల్లోడిదే పైచేయి అయింది. హోరాహోరీ పోరుతో పచ్చని అడవి ఎరుపెక్కింది. అడవి బిడ్డల రక్తంతో నేలంతా తడిసింది. చివరి శ్వాస వరకు పోరాడిన రాంజీగోండ్ తీవ్రగాయాలతో బ్రిటీష్ సైన్యానికి చిక్కాడు.
మర్రి చెట్టుకు వేయి గోండుల ఉరి..
బ్రిటీష్ వారితో హోరాహోరీగా పోరాడిన రాంజీగోండ్తో పాటు వెయ్యి మంది గోండ్ వీరులను బంధించారు. నిర్మల్ ఖజానా చెరువు దగ్గరున్న మర్రిచెట్టుకు రాంజీగోండ్ను ఉరితీశారు. అతనితో పాటు వెయ్యి మంది గోండు వీరులు కూడా బలయ్యారు. అందుకే ఆ మర్రిచెట్టును వెయ్యి ఉరుల మర్రిగా పిలుస్తారు. ఇది ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజుల కోట వద్ద ఉంది. 1995లో ఆ మర్రిచెట్టును తొలగించారు. అయితే దాని స్థానంలో రాంజీగోండ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. కాగా, ఆదివాసీ ఉద్యమ సూరీడైన రాంజీగోండ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి నేటి పిల్లలకు బోధించాలని డిమాండ్ చేస్తున్నారు.
లక్కారంలో రాంజీగోండ్ పేరు..
మండలంలోని లక్కారం గ్రామంలో ఓ సమావేశ మందిరానికి రాంజీగోండ్ భవనంగా నామకరణం చేశారు. అలాగే ఒక కాలనీకి సైతం రాంజీగోండ్ నగర్గా నామకరణం చేసి ఆదివాసీలు రాంజీగోండ్ చరిత్రను చాటారు. ఆదివారం నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి ఏర్పాట్లు చే స్తున్నారు. నేటి యువతరానికి రాంజీగోండ్ చరి త్ర తెలియజేసేలా కార్యక్రమం నిర్వహించనున్నారు.
రాంజీగోండ్ చరిత్ర చాలా మందికి తెలియదు
గోండు రాజుల్లో రాంజీగోండ్ చరిత్ర చాలా గొప్పది. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘన చరిత్ర ఆయన సొంతం. అయితే చాలా మందికి ఆయన చరిత్ర తెలియదనే చెప్పాలి. చరిత్రను చూస్తే 1857లో మంగళ్పాండే బ్రిటీష్ అధికారులను చంపేసి సిపాయిల తిరుగుబాటుకు ఊతమిచ్చాడు. కానీ అంతకుముందే బ్రిటీష్ను గడగడలాడించి, స్వేచ్ఛాజీవనం కోసం పోరాడిన వీరుడు రాంజీగోండ్. ఈయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. అప్పుడే ఆ వీరుడి గురించి నేటి యువతకు తెలుస్తుంది. ఆయన జీవితం ఆదర్శంగా ఉంటుంది.
– మర్సుకోల తిరుపతి, మాజీ సర్పంచ్