నిర్మల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ వివరాలన్నీ ఇప్పటివరకు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆ నివేదికలను ఉన్నతాధికారులకు పంపేవారు. ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల సేవలను సులభతరం చేస్తూ ‘స్మార్ట్’ సేవలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ప్రభుత్వం సెల్ ఫోన్లను అందజేసింది. రిజిస్టర్ సేవలకు స్వస్తి పలుకుతూ, సాంకేతికతను వినియోగించాలని సూచిస్తున్నది.
దీంతో ఈ నెల 1 నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా వివరాల నమోదు సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం సెంటర్లకు ఎంత మంది చిన్నారులు హాజరవుతున్నారు..? గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల వివరాలతో పాటు సెంటర్కు వచ్చే సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. న్యూట్రీషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) పేరుతో ప్రభుత్వం కొత్త యాప్ను రూపొందించింది. ఈ యాప్లో అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు తమ సెంటర్ వివరాలను నమోదు చేయాలి. ఇలా అప్లోడ్ చేసిన వివరాలను సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు పర్యవేక్షిస్తారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 926 అంగన్వాడీ, 110 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 1036 కేంద్రాల టీచర్లకు కొత్తగా రూపొందించిన యాప్పై గత నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివరాల నమోదుపై అవగాహన కల్పించారు.
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో నిర్మల్, ఖానాపూర్, ముథోల్, భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉన్నాయి. వీటి పరిధిలో1036 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణులు 6597, బాలింతలు 6154 మంది, 7 నెలల నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 62688మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి పౌష్టికాహారం ఏమేరకు అందుతున్నది.. ఎక్కడైనా పంపిణీ చేయలేని పరిస్థితులు ఉన్నాయా..? అనే అంశాల పరిశీలనను ఇకపై యాప్లో నమోదు చేసిన తర్వాతే తెలుసుకునే అవకాశాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజువారీగా పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు వివరాలను యాప్లో నమోదు చేయాల్సి ఉండడంతో పారదర్శకత పెరగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్హెచ్టీఎస్ (న్యూట్రీషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం) అనే యాప్ను రూపొందించింది. ఈ యాప్ నిర్వహణపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించేందుకు గత నెలలో ప్రత్యేక శిక్షణనిచ్చారు. సెక్టార్, ప్రాజెక్టు పరిధిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఐటీ నిపుణులతో శిక్షణ ఇచ్చారు. యాప్లో ఉండే 11 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు, చిన్నారుల బరువుకు తగ్గ ఎత్తు కొలతలు, పౌష్టికాహారం అందజేత, అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహార సమాచారం వంటి వివరాలను ఎలా నమోదు చేయాలనే విషయాలపై నిర్మల్ శివారులోని మహిళా ప్రాంగణంలో రెండురోజుల పాటు అవగాహన కల్పించారు. ఐటీ నిపుణులు శ్రీనివాస్, పోషణ్ అభియాన్ జిల్లా కో- ఆర్డినేటర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీలకు శిక్షణనిచ్చారు.
గర్భిణులు తీసుకునే పౌష్టికాహారంతో పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, బరువు ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా, పిల్లల ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. చిన్నారి ఎత్తు, బరువు కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం వయసుకు తగ్గ ఎత్తు, బరువు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా.. లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారులకు మరింత మెరుగ్గా పౌష్టికాహారం అందనున్నది.
గతంలో అంగన్వాడీ టీచర్లు 11రకాల రిజిస్టర్ల వివరాలను నమోదు చేసేవారు. ఇప్పుడు రిజిస్టర్ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేయవచ్చు. ఈనెల 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లతో పాటు సూపర్వైజర్లకు ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు అందజేసింది. మొబైల్ ఫోన్లో యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే మరింత పారదర్శకత పెరుగుతుంది. మెరుగైన సేవలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
కే విజయలక్ష్మి, డీడబ్ల్యూవో, నిర్మల్