హనుమకొండ, జనవరి 28 : మహిళాభివృద్ధిశిశు సంక్షేమ శాఖ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు (ఆర్జేడీ) ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ సుబేదారిలోని బాల రక్షా భవన్లో బాసర, రాజన్న సిరిసిల్ల జోన్ల పరిధి జిల్లా సంక్షేమ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి మహిళా, శిశు సంక్షేమం కోసం క్షేత్ర పర్యటన చేసి, సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల పనితీరు, గర్భిణులు, బాలింతలు, ప్రీ సూల్ పిల్లల నమోదు, అనుబంధ పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణం కోసం కృషిచేయాలని కోరారు. ఎత్తుకు తగిన బరువు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని , లబ్ధిదారుల హాజరు నమోదు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాలకు సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.